సంగారెడ్డి : బస్తీల్లో పేదల సుస్తి పొగొట్టేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాలు ప్రారంభించారు అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండల పరిధిలోని ఎస్.ఎన్ కాలనీ, బొంబాయి కాలనీ, ఎల్ఐజీ భారతీ నగరి కాలనీల్లో మంత్రి హరీశ్రావు బస్తీదవాఖానాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 256 బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ఈ హాస్పిటల్స్లో నిపుణులైన ఎంబీబీఎస్ డాక్టర్, స్టాఫ్ నర్సు, ఇతర సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. వైద్య సేవలు ఉచితంగానే అందిస్తున్నామని స్పష్టం చేశారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
బస్తీ దవాఖానాల్లో మీకు అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేస్తారు. టీ డయాగ్నసిస్ ద్వారా 57 రకాల పరీక్షలు మీకు ఉచితంగా చేస్తారు అని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దు.. ఈ ఆస్పత్రులను వినియోగించుకోవాలని పేదలకు హరీశ్రావు సూచించారు. పటాన్ చెరులో ఇప్పటికే 3 బస్తీ దవాఖానాలున్నాయి. ఇవాళ మరో మూడు కొత్త దవాఖానాలు ప్రారంభించుకున్నాం అని తెలిపారు. పాము కాటు, కుక్క కాటు, డెంగ్యూ, మలేరియా సహా అన్ని రకాల మందులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంటాయని మంత్రి హరీశ్రావు చెప్పారు.