హైదరాబాద్ : ఎఫ్ఆర్బీఎం చట్టంలో కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరి, రాష్ట్ర ప్రగతిపై దాని ప్రభావంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. కేంద్రం తీరుపై మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘15వ ఆర్థిక సంఘం తన నివేదికలో కేంద్రం, రాష్ట్రాలు తమ రుణ పరిమితిపై సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. క్రమపద్ధతిలోకి తేవాల్సిన అవసరం ఉంది. దీని కోసం హైపవర్ ఇంటర్ గవర్నమెంట్ కమిటీ.. అంటే కేంద్రం, రాష్ట్రాల నుంచి సభ్యులతో కూడిన కమిటీ వేసి దీన్ని సమీక్ష చేయాలని 15వ ఆర్థిక సంఘం తన నివేదికలో పేర్కొంది. కానీ, కేంద్ర ప్రభుత్వం ఇంటర్ గవర్నమెంట్ చట్టం ఏర్పాటు చేయకుండా ఏకపక్షంగా ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని సవరించే ప్రయత్నం చేసింది. మొత్తం రాష్ట్రాల నుంచి సభ్యులు, కేంద్రం నుంచి సభ్యులు నిర్ణయం తీసుకొని ఉంటే సరైన నిర్ణయం జరిగేది’ అన్నారు.
‘కేంద్రం వైఖరి బలమైనటువంటి కేంద్రం, బలహీనమైనటువంటి రాష్ట్రాలు ఉండాలి ఉన్నట్లు ఉన్నది. రాష్ట్రాలను బలహీనపరచాలనే ఉద్దేశంతో కమిటీ వేయకుండా ఏకపక్షంగా ఎఫ్ఆర్బీఎం చట్టంలో సవరణలు చేశారు. ఆ సవరణలను మాత్రం కేంద్ర ప్రభుత్వం పాటించదట. రాష్ట్రాలకు మాత్రమే వర్తింపజేసేలా తీసుకువచ్చారు. కేంద్రానికో నీతి, రాష్ట్రానికో నీతి ఉంటదా? కేంద్రం కూడా కార్పొరేషన్ల మీద.. తన రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు పెద్ద ఎత్తున అప్పులు తీసుకురావడం జరిగింది. తాను అప్పులను మాత్రం రికవరీలో పెట్టలేదు. రాష్ట్రాలు ఏదైనా ప్రభుత్వరంగ సంస్థల నుంచి తీసుకుంటే రికవరీ చేస్తాం.. మీ అప్పుల పరిమితిని తగ్గిస్తామంటూ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నది. నీతి ఏదైనా రాష్ట్రాలకు, కేంద్రానికి ఒకటే ఉండాలి. ఆర్థిక సంఘం చెప్పింది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సభ్యులతో కూడిన కమిటీని వేసి నిర్ణయం తీసుకోమన్నది. కమిటీ వేయలేదు. రాష్ట్రాలపైనే ఇంపోజ్ చేస్తున్నరు. రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను దెబ్బతీసే కుట్రకు పాల్పడుతున్నరు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు హరీశ్రావు.
‘మార్చి రెండో వారంలో శాసనసభలో మనకు ఇండికేషన్ ఇచ్చినటువంటి నాలుగు శాతం ఎఫ్ఆర్బీఎం అనుమతి ఉన్నది. నాలుగు శాతంలో పాయింట్ ఐదు శాతం మనమే వదులుకున్నం. దీనికి కారణం విద్యుత్ చట్టం. బాయిలకాడ, బోర్ల కాడ మీటర్లు పెట్టాలే.. విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తామంటే అరశాతం మీకు ఎఫ్ఆర్బీఎం ఇస్తం.. లేక పోతే ఇవ్వం అన్నరు. దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అండర్ టేకింగ్ అడిగారు. బాయికాలకాడ మీటర్లు పెడుతం.. విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే అరశాతం ఎఫ్ఆర్బీఎం ఇస్తామని స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాబొందిలో ప్రాణం ఉండగా.. తెలంగాణ రైతు బాయికాడ, బోరుకాడ మీటరు పెట్టనే పెట్టమని స్పష్టంగా చెప్పారు. వదలుకున్న అరశాతం విలువ రూ.6104కోట్లు.
ఈ డబ్బును సమకూర్చుకోవడం ముఖ్యమా? రైతుల ప్రయోజనాలు ముఖ్యమా? అనే రెండు అంశాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉండే. అరశాతం నిధుల కంటే కూడా రాష్ట్రంలోని 60లక్షల రైతుల ప్రయోజనాలే ముఖ్యమని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. రాష్ట్ర ప్రభుత్వమే రూ.6104 కోట్లను వదులుకొని మూడున్నర శాతం ఎఫ్ఆర్బీఎంతోని రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ను పొందుపరిచి ఆమోదించుకున్నాం. బడ్జెట్ ఆమోదం తెలిపిన తర్వాత రెట్రాస్పెక్టివ్గా బడ్జెట్లో కోత పెడుతామంటే.. అప్పటికే ప్లాన్ చేసుకున్నటువంటి బడ్జెట్ను ఎట్లా అమలు చేయగలుగుతాం? మొత్తం బడ్జెట్ తలకిందులవుతుంది కదా? ఎదన్న ఉంటే ప్రాస్పెక్టివ్గా చెప్పాలి. బడ్జెట్ ఆమోదానికి ముందు చెప్పాలి. చేస్తే చేశారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చేయాలి కదా? ప్రభుత్వాలను సంప్రదించాలి కదా? చర్చించాలి కదా? చర్చలు లేకుండా ఏకపక్షంగా.. తమకు వర్తింపజేసుకోకుండా కేవలం రాష్ట్రాలపై బలవంతంగా దీన్ని ఇంపోజ్ చేసే ప్రయత్నం జరిగింది’ అని ఆరోపించారు.
‘ఇదే కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం సూచించింది కదా? అని మేం చేశాం అంటున్నారని, మరి ఆర్థిక సంఘం సూచించిన విధంగా నిపుణుల కమిటీ వేయలేదు. ఒక వేళ కోతలు విధిస్తే కేంద్రం విధించుకోవడంతో పాటు రాష్ట్రాలకు విధించాలి. కానీ, కేంద్రానికి విధించకుండా రాష్ట్రాలకు పెట్టారు. ప్రాస్టెకివ్గా పెట్టకుండా రెట్రాస్పెక్టివ్గా పెట్టారు. ఇదే 15వ ఆర్థిక సంఘం తెలంగాణ రాష్ట్రానికి కొన్ని నిధులు ఇవ్వమని చెప్పింది. 15వ ఆర్థిక సంఘం కంటే ముందు దేశంలో 14 ఆర్థిక సంఘాల నివేదికలు ఉన్నాయి. జనరల్గా ఆర్థిక సంఘం నివేదిక అనేది ఒక భగవత్గీత, బైబిల్, ఖురాన్.
ఏ ఆర్థిక సంఘం రిపోర్ట్ ఇచ్చినా దాన్ని తూ.చా.తప్పకుండా యథావిధిగా గత కేంద్ర ప్రభుత్వాలు అమలు చేశాయి. కానీ, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఇదే.. 15వ ఆర్థిక సంఘం 2020-21లో రూ.723కోట్లు ప్రత్యేక గ్రాంట్గా తెలంగాణకు ఇవ్వాలని చెప్పింది. పౌష్టికాహారం కోసం రూ.171కోట్లు, 2021-26 మధ్య స్టేట్ ఫెసిఫిక్ గ్రాంట్లు, సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్ల కింద రూ.5,374కోట్లు ఇవ్వమని ఆర్థిక సంఘం సూచించింది. మొత్తంగా 15వ ఆర్థిక సంఘం తెలంగాణకు రూ.6,268కోట్ల ఇవ్వాలని సిఫారసు చేయగా.. ఆమోదించలేదు. రాష్ట్రానికి డబ్బులు ఇవ్వమని చెప్పిన చోటనేమో దాన్ని ఆమోదించకుండా మొండి చేయి చూపారు’ అని ధ్వజమెత్తారు.
‘రాష్ట్రాల రుణపరిమితిని తగ్గించాలన్న దగ్గర మాత్రం ఏకపక్షంగా రాష్ట్రాలు సేకరించకుండా కోతలు పెట్టారు. ఇదెక్కడి న్యాయం. ఆర్థిక సంఘం నివేదికను ఆమోదిస్తే.. ఇవ్వమన్న కాడ ఇవ్వండి. కోతలు పెట్టమన్నకాడ పెట్టండి. ఇది ఈ దేశ చరిత్రలో మొదటిసారి. ఇంత వరకు భారతదేశ చరిత్రలో ఎప్పుడైనా కూడా ఆర్థిక సంఘం నివేదికను గత ప్రభుత్వాలు ఆమోదించాయి. దురదృష్టవశాత్తు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కుట్ర, కక్షతో తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన డబ్బులు నిలిపివేసింది.
14వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసుల్లో రూ.817కోట్లు బకాయిపడ్డరు. అది ఇవ్వమంటే దానిపై స్పందన రాలేదు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నిధులు ఇవ్వాలని నీతిఆయోగ్ చెప్పినా.. నిధులు ఇవ్వలేదు. 2014-15లో సీఎస్ఎస్లో రాష్ట్రానికి రావాల్సిన డబ్బును తప్పుగా తెలంగాణకు ఇవ్వాల్సింది.. ఆంధ్రప్రదేశ్కు ఇచ్చారు. తప్పు చేశారు.. మా రాష్ట్ర వాటా మాకు ఇవ్వండి అని వందల సార్లు లేఖలు రాశాం.. కలిసినా ఇప్పటికు వరకు రాలేదు. ఎనిమిదేళ్లైనా రూ.495 కోట్లు రాష్ట్రం డబ్బులు లేదు’ అంటూ మండిపడ్డారు.