గజ్వేల్, సెప్టెంబరు 25: బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అభివృద్ధి శూన్యమని.. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టంచేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కూక్లో అత్యాధునిక వసతులతో నిర్మించిన పోలీస్ క్వార్టర్స్ కాంప్లెక్స్, గెస్ట్హౌస్, పలు విభాగాలను హోంమంత్రి మహమూద్ అలీ, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, డీజీపీ మహేందర్రెడ్డితో కలిసి హరీశ్రావు ప్రారంభించారు. అంతకుముందు వర్గల్ మండలం తున్కిఖాల్సా గ్రామంలో లబ్ధిదారులతో డబుల్ బెడ్రూం ఇండ్ల గృహ ప్రవేశాలను చేయించారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంతో తెలంగాణ అభివృద్ధిలో పరుగులు తీస్తున్నదని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ర్టాలు అభివృద్ధి చెందుతున్నాయన్నది పచ్చి అబద్ధమన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోనూ లేవని స్పష్టంచేశారు. బీజేపీ మాడల్ రాష్ట్రంగా చెప్పుకొనే గుజరాత్లో తాగునీళ్లకు ప్రజలు అరిగోస పడుతున్నారని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగు, తాగునీటి జలాలు పుష్కలంగా అందుబాటులోకి వచ్చి తెలంగాణ అంతా సుభిక్షంగా మారిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లు ఢిల్లీలోని ఐఏఎస్ అధికారుల క్వార్టర్స్లా బాగున్నాయని మాజీ గవర్నర్ నరసింహన్ కితాబునిచ్చారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలకంటే ఎక్కువ పనులే చేశారన్నారు. నియత్ ఉంటేనే బర్కత్ ఉంటుందని, గత ప్రభుత్వాల హయాంలో నీళ్లకు అరిగోస పడ్డ ప్రజలకు ఇప్పుడు మిషన్ భగీరథ, కాళేశ్వరం నీళ్లలో సీఎం కేసీఆర్ కనిపిస్తున్నారన్నారు.
గతంలో దొంగ రాత్రి కరెంటు వచ్చేదని, ఇప్పుడు కంటిరెప్ప కొట్టినంత సేపు కూడా కోతలు లేవని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఉచితంగానే బూస్టర్ డోస్ వేస్తున్నదని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీచైర్పర్సన్ రోజాశర్మ, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, టీఎస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐజీ విక్రమ్ సింగ్, వెస్ట్జోన్ ఐజీ కమలాసన్రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత తదితరులు పాల్గొన్నారు.
పోలీస్శాఖకు పెద్దపీట: మహమూద్ అలీ
తెలంగాణ వస్తే అభివృద్ధి కుంటుపడుతుందని, నక్సలైట్లు పెరుగుతారని ఓర్వలేని వాళ్లు అన్న మాటలను సీఎం కేసీఆర్ తలకిందులు చేశారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలీసుశాఖకు పెద్దపీట వేసి శాంతిభద్రతల విషయంలో దేశానికి ఆదర్శంగా నిలిపారని చెప్పారు. శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్న రాష్ట్రం ఎక్కువ అభివృద్ధి చెందుతుందని, అందుకు తెలంగాణ నిదర్శనమని వెల్లడించారు. తెలంగాణ పోలీసులు రాష్ట్ర, కేంద్రస్థాయిలో ఎన్నో రివార్డులు, అవార్డులు పొంది ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు.