నల్లగొండ : మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిస్తే ఒక వ్యక్తిగా అతనికి లాభం అవుతుంది.. అదే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిస్తే మునుగోడు ప్రజలందరికీ మేలు జరుగుతుంది. ఒక వ్యక్తి గెలవాలా..? మునుగోడు ప్రజలు గెలవాలా..? అన్నది ఆలోచించుకోవాలని మంత్రి హరీశ్రావు ఓటర్లకు సూచించారు. మర్రిగూడ మండలం కేంద్రంలో హరీశ్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన 200 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికి మంత్రి హరీశ్రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డికి ఓటు వేసే ప్రసక్తే లేదని మర్రిగూడ ప్రజలందరూ ముక్తకంఠంతో చెబుతున్నారని పేర్కొన్నారు. ప్రజలను ఒకసారి మోసం చేసిన రాజగోపాల్ రెడ్డికి మళ్ళీ మళ్ళీ మోసం చేసే అవకాశం ప్రజలు ఇవ్వరని తెలిపారు. మునుగోడు ప్రజలకు పాలేందో, నీళ్లు ఏందో అర్థమైందన్నారు. ఇప్పటికే సిలిండర్ ధరలు పెంచిన బీజేపీ సబ్సిడీ సిలిండర్లు సంవత్సరానికి మూడు మాత్రమే ఇవ్వబోతున్నామని ప్రకటించింది. ట్యాంకర్లతో నీళ్లు మోసుకొని ఎంత బాధ పడ్డామో మునుగోడు ప్రజలు గుర్తు తెచ్చుకోవాలి. ఫ్లోరైడ్ బాధతో అంగవైకల్యం కలిగిన బాధితులు ఇంకా మన కళ్ళముందే ఉన్నారు. నల్గొండకు ఫ్లోరైడ్ సమస్యను తీర్చిన కేసీఆర్ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని హరీశ్రావు పేర్కొన్నారు.
అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని చూసుకునే టీఆర్ఎస్ పార్టీ వృద్ధులకు రూ. 2000 పెన్షన్ ఇస్తుంది. ఇందులో ఢిల్లీ బీజేపీది ఒక్క రూపాయి ఉందా అని అడుగుతున్నాను. పేద ఆడబిడ్డ పెళ్లయితే రూ. లక్ష ఇస్తున్నాం. ఇందులో బీజేపీది రూపాయి ఉందా అని అడుగుతున్నాను. రైతుబంధు, రైతు బీమాలో మీ రూపాయి ఉందా అని బీజేపీని అడుగుతున్నాను అని హరీశ్రావు ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికలు అయిపోగానే ఢిల్లీ పార్టీ నాయకులు అక్కడికే లైన్ కట్టి వెళ్ళిపోతారు. ఇక్కడ ఉండేది కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. మన పార్టీని గెలిపించుకుంటే మునుగోడు అభివృద్ధి చెందుతుంది. మీ కళ్ళ ముందే ఉండే టీఆర్ఎస్ పార్టీ కావాలా..? ఎక్కడో ఢిల్లీలో ఉండే బీజేపీ కావాలా..? అనేది మునుగోడు ప్రజలు ఆలోచించాలన్నారు.
ఈ మర్రిగూడెం అభివృద్ధి నా బాధ్యత అని హరీశ్రావు స్పష్టం చేశారు. మూడు నెలలకు ఒకసారి వచ్చి సంవత్సరంలో మర్రిగూడను అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. ఈ నడి మంత్రం ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గెలిచి చేసేదేమీ లేదు. మళ్ళీ సంవత్సరం అయితే ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు మమ్మల్ని గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం. మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ఈ అభివృద్ధితోనే మీ ముందుకు ఓటు అడగడానికి వస్తామని హరీశ్రావు చెప్పారు.