సిద్దిపేట : కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నిలదీశారు. ఆ ఉద్యోగాల భర్తీ ఎప్పుడు చేపడుతారో చెప్పాలని డిమాండ్ చేశారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో పోటీ పరీక్షల ఉద్యోగార్థులకు ఉచిత భోజనం కార్యక్రమాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టడీ మెటీరియల్ను అందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ రోజా శర్మ, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్తో పాటు పలువురు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. భవిష్యత్తులో ప్రతియేటా ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు. గ్రూప్-1, 2 ఇంటర్వ్యూలు లేకుండా రాత పరీక్షతో పారదర్శకతతో ఉద్యోగ నియామకాలు చేపడుతామన్నారు. త్వరలోనే 500లకు పైగా పోస్టులతో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుందని తెలిపారు. 317జీఓతో అన్నీ జిల్లాల ఉద్యోగులకు సమ న్యాయం చేస్తున్నాం. దీనిపై ప్రతిపక్షాలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు మాట్లాడటం తగదన్నారు. 317జీఓ సారాంశం తెలియకుండా బీజేపీ బండి సంజయ్ ఎందుకు దీక్ష చేపట్టారో అర్ధం కావడం లేదన్నారు. రాష్ట్ర ప్రతిపక్షాలు దున్నపోతు ఈనిందటే దుడ్డేను కట్టేయన్నట్లు ఉన్నదని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఖాళీగా ఉన్న 15 లక్షల 65 వేల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తుందో తెలపాలని రాష్ట్ర బీజేపీ నేత బండి సంజయ్ను మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. కేవలం ఒక్క రైల్వేశాఖలో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఈ అంశాలపై బీజేపి నాయకులను ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తారని పేర్కొన్నారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఇస్తామంటే మీకే పాలాభిషేకం చేస్తామని హరీశ్రావు స్పష్టం చేశారు.