సంగారెడ్డి, మే 31(నమస్తే తెలంగాణ)/గజ్వేల్: హామీలు నిలబెట్టుకోకుండా రైతులతో పాటు అన్ని వర్గాలను మోసం చేసిన ఒకేఒక్క ప్రధాని నరేంద్ర మోదీ అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆరోపించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని, కనీస మద్దతు ధర చట్టాన్ని అమలు చేస్తానని, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తానని చెప్పి గద్దెనెక్కిన మోదీ.. ఒక్క హామీ నెరవేర్చలేదని అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా మల్కాపూర్లోని ఓ ఫంక్షన్ హాల్లో, సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని మహతి ఆడిటోరియంలో వానకాలం సాగుపై సన్నాహాక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలకు ముఖ్య అతిథులుగా ఆర్థిక మంత్రి హరీశ్రావు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డితో కలిసి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ తీరుతో దేశ వ్యవసాయ రంగం వెనుకబాటుకు గురైందని అన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయటంలో ఈ రెండు పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని ఆరోపించారు.
న్యూజిలాండ్, స్పెయిన్ వంటి చిన్న దేశాలు కూడా వ్యవసాయం, హార్టికల్చర్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నాయని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల్లో పెట్టే ప్రయత్నం చేసిన మోదీ.. చివరికి తన ప్రయత్నం విఫలం కావటంతో రైతులకు క్షమాపణలు చెప్పారని అన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయటంతో ఉచిత కరెంటు, రైతు బీమా, రైతు బంధుతో రైతులకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు. ఆయన అవలంబిస్తున్న విధానాలతో తెలంగాణ ఆర్థికంగా బలోపేతం అవుతున్నదని తెలిపారు. వ్యవసాయ రంగంపై టీఆర్ఎస్ సర్కారు రూ.3.75 లక్షల కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు.
వానకాలం సీజన్లో రైతులు వరి సాగు తగ్గించి పత్తి, కంది, నూనె గింజలు, ఆయిల్పామ్, ఆముదం, అపరాలు సాగు చేయాలని సూచించారు. రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియంవైపు మొగ్గు చూపాలని చెప్పారు. పంటమార్పిడిలో సంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు ముందంజలో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఆలుగడ్డ సాగు పెరగాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. రాష్ట్రంలో 2.50 లక్షల ఎకరాల్లో ఆలు సాగయ్యేలా చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు. సిద్దిపేట జిల్లా కోహెడలో అంతర్జాతీయ ప్రమాణాలతో 167 ఎకరాల విస్తీర్ణంలో ఫ్రూట్ మార్కెట్ నిర్మిస్తున్నామని వివరించారు. ఇందులో పది ఎకరాల్లో శీతల గిడ్డంగులు నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు.
పంటల సాగుపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తూ, రైతులకు నష్టం చేస్తున్నాయని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. వానకాలం సీజన్లో వ్యవసాయ అధికారులు రైతుల వద్దకు వచ్చి పంటల సాగుపై సలహాలు ఇస్తారని చెప్పారు. రైతుబంధు కోఆర్డినేటర్లకు ప్రతి నెల రూ.9 వేలు అందజేస్తామని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని ప్రోత్సహించేందుకు 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల ఉచిత విద్యుత్తును అందిస్తున్నామని వెల్లడించారు. వ్యవసాయాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని 2,604 మంది వ్యవసాయ విస్తరణ అధికారులను ప్రభుత్వం నియమించిందని వివరించారు. సమావేశాల్లో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, మాణిక్రావు, పద్మాదేవేందర్రెడ్డి, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జడ్పీ చైర్పర్సన్లు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్, డీసీఎంఎస్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్, బీజేపీ రైతులను మోసం చేస్తున్నాయని మంత్రి హరీశ్రావు ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కరెంటు సమస్యలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇప్పుడు ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం బోరుబావులు, బావుల వద్ద మీటర్లు పెట్టాలంటున్నదని చెప్పారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ బోరుబావుల వద్ద మీటర్లు పెట్టేది లేదని స్పష్టం చేశారని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలతో రైతులు ఊహకందని రీతిలో ధాన్యపు రాశులు పండిస్తున్నారని చెప్పారు. వరినాట్లు వేయటానికి, ధాన్యం కొనుగోళ్లలో హమాలీలుగా పనిచేయడానికి వేరే రాష్ర్టాల కూలీలు వచ్చి ఉపాధి పొందుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ, సాఫ్ట్వేర్ ఉద్యోగుల స్థాయిలో కొంతమంది రైతులు ఆదాయాన్ని సంపాదిస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో 7,272మంది రైతు కుటుంబాలకు రైతు బీమా అందిస్తే, ఆ రైతులవి ఆత్మహత్యలని ప్రతిపక్షాలు లెక్కపెట్టడం దారుణమని అన్నారు. కేంద్రం పెట్రో, డీజిల్ ధరలు పెంచటంతో రైతులపై ఆర్థిక భారం పడుతున్నదని తెలిపారు. రాష్ట్రంలోనే అతి తక్కువ విస్తీర్ణంలో వరి సంగారెడ్డిలో సాగు అవుతున్నదని అన్నారు. సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు అందజేస్తున్నామని, రైతులు వాటిని విరివిగా సాగు చేయాలని సూచించారు. పచ్చిరొట్ట సాగుతో భూసారం పెరుగుతుందని వివరించారు.