సిద్ధిపేట : ఐదేళ్లలో 73శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్ధిపేట జిల్లాకేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో ఎస్టీయూ 75 వసంతాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలు, జాతీయ సమైక్యత తెలంగాణ వజ్రోత్సవాలు ఏ విధంగా జరుపుకున్నామో.. ఇవాళ ఎస్టీయూ 75 వసంతాలు జరుపుకోవడం చాలా గర్వకారణమన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో తెలంగాణ తరహాలో వేతనాలు లేవని, కేవలం రాష్ట్రంలోనే ఇస్తున్నామన్నారు.
ఇవాళ దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలో తప్ప.. ఏ రాష్ట్రంలో ప్రతి రోజూ ఇంటింటికీ తాగునీరు అందివ్వలేదన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మిషన్ భగీరథకు బహుమతి అందించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో 12శాతం బడ్జెట్ను విద్యారంగంపై పెట్టడం గర్వ కారణమన్నారు. తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి అమలు చేస్తుందని విమర్శించారు. పక్క రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు తెలంగాణలో అమలవుతున్న పథకాలు అందించాలని అసెబ్లీలలో అడుగుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన రూ.30వేలకోట్లు బకాయిలు ఇవ్వడం లేదని, తెలంగాణలో అమలవుతున్న పథకాలు అపాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. రైతు బతుకు అరటాకు మీద ముల్లులాంటిదని, అలాంటి రైతులను కాపాడుకోవడం మన బాధ్యతన్నారు. సిద్ధిపేట జిల్లావ్యాప్తంగా 5.50 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వస్తున్నది, 75 ఏండ్లలో కానీ అభివృద్ధి 7 ఏండ్లలో చేసి చూపెట్టామన్నారు. 75 ఏండ్లలో 5 మెడికల్ కళాశాలలు ఉంటే, ఏడేండ్లలో తెలంగాణలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసుకున్నామని, 75 ఏండ్లలో రాష్ట్రంలో 800 మెడికల్ సీట్లు ఉంటే, ఇవాళ 2,840 మెడికల్ సీట్లు వచ్చాయని గుర్తు చేశారు.
విద్య, వైద్య రంగాన్ని అన్ని కోణాల్లో అభివృద్ధి చేస్తున్నామని, విద్యాశాఖతో పాటు ఇతరశాఖలను కలుపుకుని 11శాతం విద్యపై బడ్జెట్ పెట్టామన్నారు. కేంద్రం కోతలు పెట్టినా కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి సంక్షేమ పథకాలను ఆగడం లేదన్నారు. మన ఊరు-మనబడి కార్యక్రమానికి రూ.7,300 కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టామన్నారు. ఉపాధ్యాయులకు కొన్ని సమస్యలు ఉన్నాయని, సాధ్యమైనంత వరకూ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాన్నారు. ఈహెచ్ఎస్ పథకం అమలు కోసం సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు.