హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టీకా మొదటి డోసు పంపిణీ 102 శాతం పూర్తయిందని మంత్రి హరీశ్ అన్నారు. టీకా పంపిణీలో తెలంగాణ ముందంజలో ఉందని చెప్పారు. ప్రభుత్వం అందరికీ ఉచితంగా టీకాలు అందిస్తున్నదని మంత్రి హరీశ్ రావు అన్నారు. నగరంలోని చార్మినార్ యునానీ దావాఖానలో బూస్టర్ డోసు పంపిణీని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. టీకా విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదని సూచించారు. బూస్టర్ డోసుతో ప్రయోజనాలు ఉన్నాయని, అర్హులంతా బూస్టర్ డోసు వేసుకోవాలని చెప్పారు.
అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో బూస్టర్ డోసు వేసుకుంటున్నారని అన్నారు. ప్రజా ప్రతినిధులు ఇందులో భాగస్వామ్యం కావాలని చెప్పారు. 15 నుంచి 18 ఏండ్ల టీనేజర్లలో 38 శాతం మందికి మొదటి డోసు వేశామన్నారు. వ్యాక్సినేషన్ను వేగంగా పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.
యునానీ దవాఖాన సమస్యలపై చర్చించామని, త్వరలో హాస్పిటల్ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. దవాఖానలో ఖాళీల భర్తీకి రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు. ప్రొఫెసర్లు కూడా మరిని సేవలు అందించాలని సూచించారు.