కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా కట్టడికి రెండు టాస్క్ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేసినట్లు మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన ఈ రెండు కమిటీలు ఏర్పడ్డాయి. 24 గంటల పాటు వాట్సాప్లో అందుబాటులో ఉండే విధంగా గ్రూప్ ఏర్పాటు చేశారు. ఇక సిటీ స్కానింగ్కు రూ. 2 వేలు మాత్రమే తీసుకునేలా ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలను ఒప్పించారు. స్కాన్ ఫిలిం కావాలంటే అదనంగా రూ. 200 చెల్లిస్తే సరిపోతుందన్నారు. మంత్రి సూచనను యాజమాన్యాలు అంగీకరించాయి. ఈ ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయన్నారు.
వాట్సాప్ గ్రూపులో ప్రతి రోజు ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో ఉన్న ఆక్సిజన్ బెడ్ల వివరాలను తెలియజేస్తామన్నారు. కరోనా రోగుల నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేసే ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా బాధితుల పట్ల ప్రయివేటు డాక్టర్లు మానవీయ కోణంతో పని చేయాలన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.