హైదరాబాద్ : యాసంగి ధాన్యం సేకరణపై ఎఫ్సీఐ జనరల్ మేనేజర్ దీపక్ శర్మతో రాష్ట్ర
పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ భేటీ అయ్యారు. సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషన్ అనిల్కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎఫ్సీఐకి తెలంగాణ ఈ యాసంగిలో చేయబోయే ధాన్యం సేకరణ వివరాల్ని వెల్లడించారు. యాసంగిలో తెలంగాణ ప్రత్యేక పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకొని తెలంగాణ రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. నూక శాతం ఎక్కువగా ఉండే నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాలతో రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని అదనపు భారాన్ని భరించి ధాన్యం సేకరిస్తున్నామని, సీఎంఆర్ సమయంలో అనవసర కొర్రీలు పెట్టి ఇబ్బందులు సృష్టించొద్దన్నారు.
నాణ్యతా ప్రమాణాల మేరకు ముడి బియ్యం అందజేస్తామని, ఇందు కోసం లేఖల్ని కేంద్ర ప్రభుత్వానికి, ఎఫ్సీఐ అందజేస్తామన్నారు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో బ్రోకెన్ శాతం ఎక్కువగా ఉండే నేపథ్యంలో ఎఫ్సీఐ ఎలాంటి అభ్యంతరాలు లేకుండా తీసుకోవాలని కోరారు. గత యాసంగిలో తీసుకోవాల్సిన 2.52లక్షల మెట్రిక్ టన్నులు ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రూపంలో తీసుకోవాలని.. గత వానాకాలం సీఎంఆర్ వేగంగా అందించే విధంగా ర్యాకులు, అదనపు స్టోరేజీ కల్పించాల్సిందిగా కోరారు. సీఎంఆర్ గడువులో తక్కువ ధాన్యం సేకరించే రాష్ట్రాలకు అధికంగా సేకరించే తెలంగాణకు ఒకే గడువు ఇస్తున్న అసమగ్ర విధానాన్ని సైతం పునఃసమీక్షించాలని, అదనపు గడువును సైతం కేవలం నెలరోజులకు మాత్రమే ఇస్తున్న అంశాన్ని దీపక్ శర్మ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాల్సిందిగా మంత్రి గంగుల కమలాకర్ కోరారు.
35.80 లక్షల ఎకరాల్లో వరి సాగైందని, దాదాపు 60 లక్షల మెట్రిక్ టన్నులను సేకరిస్తున్నామని వీటికి 15కోట్ల గన్నీ సంచులు అవసరమని, వీటి కోసం జూట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాకు లేఖ రాసామని వారు సప్లై చేయగా మిగిలనవి జెమ్ పోర్టల్తో పాటు బహిరంగ వేలం ద్వారా సేకరిస్తామన్నారు. అలాగే యాసంగి సేకరణలో ఇబ్బందులు లేకుండా చూడడానికి ఎఫ్సీఐ నుంచి డీజీఎం కమలాకర్, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ నుంచి జీఎం రాజిరెడ్డిలను నోడల్ ఆఫీసర్లుగా నియమిస్తామని మంత్రి గంగుల తెలిపారు. అనంతరం సివిల్ సప్లైస్ అధికారులతో సమీక్షలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం అదనపు భారాన్ని భరించి దేశంలో ఎక్కడాలేని విదంగా కనీస మద్ధతు ధరతో ధాన్యం సేకరణ చేస్తున్న నేపథ్యంతో పక్క రాష్ట్రాల నుంచి ఒక్క వడ్ల గింజ మన కొనుగోలు కేంద్రాల్లోకి రాకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇందుకోసం విజిలెన్స్ టీం పక్కా ప్రణాళికలతో ఈ రెండు నెలలు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఎలాంటి రీసైక్లింగ్ బియ్యం రాకుండా పటిష్ట చర్యలు తీసుకొని ఎక్కడికక్కడ అదుపు చేయాలని, వాటిపై కఠినంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేయాలన్నారు. రైస్ మిల్లర్ల వద్ద ఉన్న సివిల్ సప్లైస్ శాఖ గన్నీ సంచులు త్వరగా సేకరించాలని ఆదేశించారు. జిల్లాల్లో సివిల్ సప్లైస్ డీఎంలు, డీఎస్వోలు నిరంతర పర్యవేక్షణ చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
ఎండలను తట్టుకునేలా నీడ సౌకర్యం ఏర్పాటు, మంచినీరు, అకాల వర్షాలు, గాలివానల నుండి రక్షణ చర్యలుగా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. జిల్లాల వారీగా ఎప్పటికప్పుడు అవసరమైన మేర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు నిన్నటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 34 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసామన్నారు. అనంతరం ధాన్యం సేకరణలో ఆర్థిక పరమైన అంశాలపై రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో బీఆర్కే భవన్లో భేటీ అయ్యారు. లోన్లపై రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీ, గత బకాయిలు వంటి వాటిపై చర్చించారు. కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్తో పాటు ఎఫ్సీఐ జనరల్ మేనేజర్ దీపక్ శర్మ, సివిల్ సప్లైస్ కమిషనర్ అనిల్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.