హైదరాబాద్ : ఢిల్లీ పర్యటనలో మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ బుధవారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కలిసి, రాష్ట్ర అంశాలపై వినతిపత్రాలు అందజేసిన విషయం తెలిసిందే. స్పందించిన ఆయన.. అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆహార పౌరసరఫరాల కార్యదర్శి సుదాన్షు పాండేను ఆదేశించారు. ఈ సందర్భంగా గురువారం మంత్రి గంగుల, రాష్ట్ర సివిల్ సప్లయిస్ కమిషనర్ అనిల్కుమార్ ధాన్యం సమస్యలపై ఢిల్లీ కృషి భవన్లో పాండేతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మూడు ప్రధాన సమస్యలపై సమగ్ర వివరాలు అందించారు.
ఈ యాసంగిలో పారాబాయిల్డ్ రైస్ 50లక్షల మెట్రిక్ టన్నులు ఎఫ్సీఐ తీసుకొని రైతులకు మేలు చేయాలని, గతంలో 2019-20 రబీలో నష్టపోయిన 30 రోజుల్ని భర్తీ చేసి మిగిలిన బియ్యాన్ని అందించడానికి మరో 30 రోజుల గడువుని పెంచాలని కోరారు. రాబోయే వానాకాలంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు అనుమతించాలని కోరారు. గతంలో సైతం ఇదే రీతిన కొనుగోళ్లు జరిగాయని వాటికి సంబంధించిన గణాంకాలను కేంద్ర కార్యదర్శికి మంత్రి అందజేశారు.
ఆయా అంశాలపై కేంద్ర ప్రభుత్వ కార్యదర్శితో సమగ్రంగా చర్చించిన మంత్రు గంగుల, తెలంగాణలో మిల్లింగ్ కొనసాగుతున్నందున సత్వర పరిష్కారం కోసం వేగంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి గంగుల విజ్ఞప్తి మేరకు కేంద్ర కార్యదర్శి మధ్యాహ్నం ఎఫ్సీఐ ఉన్నతాధికారులు, రాష్ట్ర అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. తద్వారా అన్ని సమస్యలకు సత్వర పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.