హుజూరాబాద్: నాడు ఎక్కడ చూసినా ఎండిన జలాశయాలు మాత్రమే కనిపించేవని, కేసీఆర్ కృషితో నేడు అవి నిండుకుండలుగా మారాయని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు తయారుచేసుకున్న ఆయుధం కేసీఆర్ అని అభివర్ణించారు. హుజూరాబాద్లోని 29వ వార్డు గాంధీనగర్లో శుక్రవారం ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా దళితులను ఎవరూ పట్టించుకోలేదన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని చెప్పారు. ఏడేళ్ల క్రితం ఉన్నట్లు తెలంగాణ ఇప్పుడు లేదని, కేసీఆర్ కృషితో ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. అన్ని వర్గాలకూ సంక్షేమ పథకాలు అమలుచేస్తూ బతుకులు బాగుచేస్తున్నామన్నారు. ఇదివరకు మన ఆడబిడ్డలు నీటికోసం ట్యాంకర్ల వద్ద బిందెలతో కనిపించేవారని, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు.
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ నిఖార్సైన ఉద్యమకారుడని, ఇరవై ఏళ్లు కేసీఆర్ వెంటే నడిచినా ఏనాడూ పదవి కోసం పాకులాడలేదన్నారు. అందుకే గెల్లు శ్రీనివాస్యాదవ్కు ఈసారి సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చారని చెప్పారు. గెల్లును గెలిపిస్తే నిరంతరం అందుబాటులో ఉండి సేవచేస్తాడని తెలిపారు. ఈటల రాజేందర్ ఇరవై ఏళ్లుగా అనేక పదవులు చేపట్టినా హుజూరాబాద్ అభివృద్ధిని పట్టించుకోలేదని మంత్రి గంగుల కమలాకర్ దుయ్యబట్టారు. అసలు ఈటల రాజేందర్ ఎవరికోసం రాజీనామా చేశారో ఇక్కడి ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్కు మెడికల్ కాలేజీ కావాలని రాజీనామా చేశారా? లేదా హుజూరాబాద్లో ఇండస్ట్రీలు పెట్టాలని రాజీనామా చేశారా? అని ప్రశ్నించారు. కేవలం తన స్వార్థంకోసం మాత్రమే ఈటల రాజేందర్ రాజీనామా చేశారని మండిపడ్డారు. ఇప్పుడు బీజేపీలో చేరి మళ్లీ తనకు ఓటేయాలంటూ ప్రజలు చుట్టూ తిరుగుతున్నాడన్నారు. మంత్రిగా ఉన్నప్పుడే ఏమీ చేయలేని ఈటల రాజేందర్ ఇప్పుడేం చేస్తారని మంత్రి గంగుల ప్రశ్నించారు. హుజూరాబాద్ అభివృద్ధి ఇక్కడి ప్రజల చేతుల్లోనే ఉన్నదని, గెల్లు శ్రీనివాస్యాదవ్ను గెలిపించుకుని అభివృద్ధి బాటపట్టాలని సూచించారు. ఆయన వెంట స్థానిక నేతలు, కార్యకర్తలు ఉన్నారు.