కరీంనగర్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): ఆంధ్రా నాయకులు పచ్చని సంసారంలో చిచ్చుపెట్టాలని చూస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. జగన్ పార్టీ బీజేపీకి బీ టీమ్ అని, కేసీఆర్ కుటుంబంలో చిచ్చుపెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. శనివారం కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు కుటుంబంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ప్రభుత్వంపై ఇప్పటికే కేంద్రం విషం చిమ్ముతున్నదని, ఈ సమయంలో హరీశ్రావుపై సజ్జల చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే వైఎస్సార్సీపీ బీజేపీకి బీ టీమ్గా అర్థమవుతున్నదన్నారు. కేసీఆర్, హరీశ్రావు మధ్య సజ్జల చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ఒక పార్టీ కాదని, అది ఒక కుటుంబమని, ఈ కుటుంబానికి పెద్ద కేసీఆర్ అని, ఈ కుటుంబంలో చిచ్చు పెట్టడం ఎవరి తరం కాదన్నారు.
వైఎస్ కుటుంబంలో ఉడుములా చొచ్చిన సజ్జల.. తల్లీకొడుకును, అన్నాచెల్లిని విడగొట్టాడని, ఇప్పుడు కేసీఆర్ కుటుంబంపై పడుతున్నారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఆ ఫ్రస్టేషన్లో సజ్జల ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఏపీ నుంచి తెలంగాణకు పెరుగుతున్న వలసలే జగన్ ప్రభుత్వం విఫలమైందని చెప్పడానికి నిదర్శనమన్నారు. హరీశ్రావు తమ ఆస్తి అని, టీఆర్ఎస్ సోల్జరని, కేసీఆర్ను ఆయన ఎన్నడూ మామ అనలేదని, తండ్రిలా భావిస్తారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మా రాష్ట్ర పథకాలు ఉన్నాయని అనడంలో తప్పేమున్నదని ప్రశ్నించారు.
మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ర్టాలు ఇప్పుడు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నాయని, తెలంగాణ పథకాలు ఆ రాష్ర్టాల్లోనూ అమలు కావాలని ఆకాంక్షిస్తున్నాయని చెప్పారు. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టిన తర్వాత ఏపీలో బరాబర్ పాగా వేస్తామని స్పష్టంచేశారు. కేంద్రం బావుల మోటర్లకు మీటర్లు పెడతామంటే ఏపీ సీఎం జగన్ ఎందుకు వ్యతిరేకించలేదని నిలదీశారు. మీటర్ల పెట్టకపోతే అప్పులు ఇవ్వమని కేంద్రం బెదిరించినా అదే మా నాయకుడు కేసీఆర్ తెలంగాణలో ఒక్క మోటరుకు కూడా మీటర్ పెట్టనీయ లేదని గుర్తుచేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి తెలంగాణ జోలికి రావొద్దని, ఒక వేళ వస్తే 2014 ముందటి పరిస్థితులు చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
హరీశ్ వ్యాఖ్యలపై రాద్ధాంతం తగదు
ఏపీ ఉద్యోగుల సమస్యలపై ఇటీవల మంత్రి హరీశ్రావు స్పందించిన తీరుపై ఏపీ మంత్రులు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు చేసిన ప్రకటనను టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ ఖండించారు. ఇటీవల ఓ ఉపాధ్యాయ సంఘం సమావేశంలో హరీశ్రావు ప్రసంగిస్తూ ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో మెరుగైన వేతనాలు పొందుతున్నారని, ఏపీలోని పరిస్థితిని వివరిస్తే దానిని రాద్ధాంతం చేయడం హాస్యాస్పదమన్నారు. తెలంగాణలో ఎనిమిదేండ్లల్లో పే రివిజన్ ద్వారా 73% (43+30) సాధిస్తే, అదే ఏపీలో కేవలం 66% మాత్రమే (43+23) ఇచ్చింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
ఉద్యోగులకు ఉద్యమ చరిత్రలో మధ్యంతర భృతి 27% కంటే తకువగా కేవలం 23% ఏపీలో తీసుకున్నది నిజం కాదా? దీనికి బాధ్యత సంఘాలకు నాయకత్వం వహించిన నాయకులదా? ప్రభుత్వానిదా? ఉ ద్యోగ సంఘ నేతలు స్పష్టం చేయాలన్నారు. ఏపీ ఉద్యోగుల పట్ల తెలంగాణ ప్రభుత్వానికి, ఉద్యోగులకు ఎలాంటి కోపం లేదని, సమస్యను పరిశీలించి హరీశ్రావు చేసిన ప్రకటనగా మాత్ర మే చూడాలని కోరారు. ఏపీ ప్రభుత్వం అనుసరించిన నిర్బంధకాండను ఇతర సంఘ నాయకులు సమావేశంలో ఉదహరిస్తే.. దాని ఆధారంగానే హరీశ్రావు తన ప్రసంగంలో ఏపీతో పొల్చితే తెలంగాణలోనే ఉద్యోగులు సంతోషంగా ఉన్నారని అన్నారని, దీనిని ఏదో నేరంగా భావించి ఉద్యోగ సంఘాల నాయకుడు ఖండించడం సరికాదన్నారు.