కరీంనగర్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వరి ధాన్యం పండించే రైతులకు ఉరి పెడుతోందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బాయిల్డ్ రైస్ కొనమంటే కొర్రీలు పెడుతుందని మండిపడ్డారు. మంగళవారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ నిబంధనల ప్రకారం రైతు పండించిన పంటను కొనుగోలు చేయాల్సిన కేంద్రం చేతులెత్తేస్తే రైతన్నల పరిస్థితి ఏం కావాలని ప్రశ్నించారు. మౌలిక సదుపాయాలు కల్పించి ఉత్పత్తి చేయడం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని తెలిపారు. కొనుగోలు, ఎగుమతి, ధాన్యం నిల్వలు వంటి అంశాలను కేంద్రమే చూసుకోవాలని రాజ్యాంగంలో నిబంధనలు ఉన్నాయని మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. రైతు హక్కులను కేంద్రం కాల రాస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
సెప్టెంబర్ 1న మంత్రి కేటీఆర్ తో పాటు తాను కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ ను కలిసి పంట కొనుగోలు విషయాన్ని సామాజిక కోణంలో చూడాలని కోరామని చెప్పారు. తెలంగాణ రైతులు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేశారని పేర్కొన్నారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్, రైతు బంధు తో దుకున్నారు. దీంతో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని పేర్కొన్నారు. రాష్ట్రాల్లో అవసరానికి సరిపడా బియ్యం ఉంచుకొని మిగులు బియ్యం ఎఫ్సీఐకి పంపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరిగిందని గుర్తు చేశారు. 20 / 21 లో 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేయగా 62 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వస్తుందన్నారు.
ఆ బియ్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రాన్ని అడిగితే అవి బాయిల్డ్ రైస్ అని, అందులో కేవలం 25 లక్షల మెట్రిక్ టన్నులే తీసుకుంటాం అని కేంద్రం చెప్పిందన్నారు. మిగతా 37 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎవరు కొంటారని కేంద్రాన్ని అడుగుతున్నాం. మేము భిక్షం అడగడం లేదు రాజ్యాంగ పరంగా కల్పించిన హక్కుగా అడుగుతున్నాం. మద్దతు ధర, కేంద్ర వ్యవసాయ చట్టాలు, ఎగుమతులు అన్నీ కేంద్రం పరిధిలో ఉంటాయని పేర్కొన్నారు. ఇలాంటి సంక్షోభం గతంలో వస్తే కూడా వాజపేయి ప్రభుత్వం పూర్తిగా ఏడు కోట్ల టన్నులు కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా మోదీ ప్రభుత్వం పూర్తిగా బియ్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రోక్యూర్ మెంట్ ఎత్తేసే ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. బాయిల్డ్ రైస్ తీసుకోకపోతే రైస్ మిల్లుల్లో పేరుకుపోయి కొత్త ధాన్యం ఎక్కడ పెట్టాలి. అట్లయితే రైతుల పరిస్తితి ఏం కావాలి?
బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్రం పై ఒత్తిడి తేవాలి. ఇప్పటికిప్పుడు రైతులు పంట మార్పిడి చేయలేరు, ప్రతి గింజనూ కేంద్రం తప్పకుండా కొనాల్సిందే. లేకపోతే నిలదీస్తామని మంత్రి గంగుల అన్నారు. పంజాబ్ లో బాయిల్డ్ రైస్ మొత్తం కొన్నారు. తెలంగాణలో ఎందుకు కొనరు? తెలంగాణ అంటే వివక్షనా? సౌత్ ఇండియా మీద ప్రేమలేదా
కేంద్రం నాన్చుడు ధోరణితో తెలంగాణ రైతాంగ భవిష్యత్తును నాశనం చేయొద్దని సూచించారు.