సిరిసిల్ల: బీజేపీ యూపీ, గుజరాత్, బీహార్ సంస్కృతిని నమ్ముకున్నదని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. తమపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడికిపాల్పడటం దుర్మార్గమైన చర్య అన్నారు. ఎల్లారెడ్డిపేటలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆగయ్యను ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, రవి శంకర్తో కలిసి మంత్రి గంగుల కమలాకర్ పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆగయ్యపై బీజేపీ గూండాలు హత్యాయత్నానికి పాల్పడ్డారని చెప్పారు. తమ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఏంచేశారని దాడికి యత్నించారని ప్రశ్నించారు.
బీజేపైపై నమ్మకం లేక, బండి సంజయ్పై అసంతృప్తితో ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లు మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారని వెల్లడించారు. దీంతో ఓర్వలేక టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రామచంద్రం అనే బీజేపీ కార్యకర్త పెట్టిన పోస్టులు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని, వాటిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన తమ కార్యకర్తలపై దాడిచేశారన్నారు. కార్యకర్తలకు టీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారికి ఏంజరిగినా సహించేది లేదని స్పష్టం చేశారు.
బీజేపీ కార్పొరేటర్లు టీఆర్ఎస్లో చేరడంతో బండి సంజయ్కు మతితప్పిందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. టీఆర్ఎస్ను బద్నాం చేసేలా బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బుల్డోజర్ వచ్చేదాకా మేం ఊరుకుంటామా.. తొక్కితే పాతాళానికి పోతారని హెచ్చరించారు. బీజేపీ వాళ్లు పిడికెడు.. మేము పుట్టెడు ఉన్నామని చెప్పారు.