కరీంనగర్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్, బీజేపీ నాయకులు అపవిత్ర పొత్తులతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, ప్రజలు దూరం కొడుతున్నా సిగ్గు లేకుండా టీఆర్ఎస్ను ఓడించేందుకు అనైతికంగా వ్యవహరిస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించిన తర్వాత స్పందించిన ఆయన, ఎస్సారార్ కళాశాలలోని మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ అనైతిక పొత్తులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్పై కడుపు మంటతో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీజేపీ, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థిగా ఒకరిని నిలబెట్టారని రవీందర్సింగ్ను ఉద్దేశించి అన్నారు. ఈ రెండు పార్టీలు, స్వతంత్ర ఓటర్లతో ఉమ్మడి అభ్యర్థిని నిలబెడుతున్నామని ఈటల రాజేందర్ ప్రకటన కూడా చేశారని గుర్తు చేశారు. తమకున్న 986 ఓట్లలో ఒక్క ఓటు కూడా తగ్గదని తాము ముందే చెప్పామని గుర్తు చేశారు. ఉమ్మడి అభ్యర్థికి కాంగ్రెస్, బీజేపీ నుంచి మొత్తం ఓట్లు వచ్చాయా?, మరీ ఆ రెండు పార్టీల ఓట్లు ఎటు వెళ్లాయో ఆలోచించాలని సూచించారు.
బీజేపీ నుంచి సుమారు 105 మంది ఓట్లు వేశారా? లేదా? గమనించాలని, పోలైన ఓట్లు ఈ రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థికి పోలయ్యాయా? లేదా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన బలం లేనందున తమ పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెట్టడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటిస్తే కాంగ్రెస్, బీజేపీ నుంచి ఉమ్మడి అభ్యర్థిని నిలబెడుతున్నామని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రకటించడం ఆ పార్టీలో అంతర్గత పోరుకు నిదర్శనమని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి నిలబెట్టిన ఈ అభ్యర్థిని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఛీత్కరించారని, ఆ పార్టీల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులకు 86 ఓట్లు అదనంగా వచ్చాయని మంత్రి స్పష్టం చేశారు.
కాంగ్రెస్, బీజేపీ అపవిత్ర పొత్తులు జిల్లాలో కొత్తేమీ కావని, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోనూ ఈ పార్టీలు రెండు కలిసి పోటీ చేశాయని, ఆ పన్నాగాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అమలు చేశాయని మంత్రి గంగుల ధ్వజమెత్తారు. హుజూరాబాద్లో ఈ రెండు పార్టీలు కలిసి తమ పార్టీపై దాడిచేశాయన్నారు. 2018లో ఇదే ఈటల రాజేందర్ కేసీఆర్ బొమ్మతో పోటీచేసి 43 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారని, అదే ఉప ఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేసినప్పుడు మెజార్టీ పెరిగిందా?, తగ్గిందా? ఒక్కసారి ఆలోచించాలని హితవు పలికారు.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయా? లేక ఈటల రాజేందరా? చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము అభ్యర్థిని నిలబెట్టడం లేదని బండి సంజయ్ చెబితే కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అని ఈటల రాజేందర్ చెప్పడం దేనికి సంకేతమని మంత్రి ప్రశ్నించారు. బీజేపీ ఓట్లు ఉమ్మడి అభ్యర్థికి పడలేదు కనుకనే తమ పార్టీకి బలం పెరిగిందన్నారు. సీఎం కేసీఆర్కు ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి ఓర్వలేక అపవిత్ర పొత్తులతో తమ పార్టీని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. 986 ఓట్లకన్నా తాము ఒక్క ఓటు కూడా ఎక్కువ అడగమని, తమకున్న ఓట్లలో ఒక్క ఓటు కూడా తగ్గదని ఎన్నికల ముందే ప్రకటించామని, కానీ బీజేపీ, కాంగ్రెస్ నుంచి తమకు ఓట్లు రావడంతో మా అభ్యర్థుల మెజార్టీ పెరిగిందన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధి స్థానిక సంస్థల్లోని 1324 స్థానాల్లో తమ టీఆర్ఎస్ పక్షాన 870 మంది గెలిచారని, టీఆర్ఎస్, కేసీఆర్పై ఉన్న అభిమానంతో వివిధ పార్టీల నుంచి గెలిచిన వాళ్లు, స్వతంత్రులు 116 తమ పార్టీలో చేరినట్లు గుర్తు చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్ బలం 986 స్థానాలకు చేరిందన్నారు. ఈ ఓట్లతోనే తాము స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు వెళ్లామని మంత్రి గంగుల స్పష్టం చేశారు. టీఆర్ఎస్సేతర ఓట్లు 324 ఉన్నప్పటికీ ఉమ్మడి అభ్యర్థికి 232 ఓట్లు మాత్రమే వచ్చాయంటే కాంగ్రెస్, బీజేపీల్లో అంతర్గతంగా ఆ పార్టీల నాయకులపై వ్యతిరేకత ఉన్నట్లు స్పష్టమైందన్నారు.
రాష్ర్టాన్ని సాధించిన పార్టీగా టీఆర్ఎస్కు మాత్రమే ఓట్లు అడిగే హక్కు ఉందని, ఇలాంటి అపవిత్ర పొత్తులను ప్రజలు స్వీకరించడం లేదని స్పష్టం చేశారు. కౌంటింగ్ రోజు దాకా ఆగకుండా ఓటింగ్ రోజునే ర్యాలీలు తీయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీఆర్ఎస్ క్రమ శిక్షణకు మారుపేరని ఈ ఎన్నికల ద్వారా మరోసారి నిరూపితమైందన్నారు.
ఈటల రాజేందర్ తన వ్యక్తిగత ఎజెండాలు అమలు చేయాలని చూస్తారని ఎమ్మెల్సీ భానుప్రసాద్రావు విమర్శించారు. పార్టీలో సమష్టి నిర్ణయాలు జరుగుతాయని, ఇలాంటివి ఈటల పట్టించుకోడని ఆరోపించారు. ఆయన టీఆర్ఎస్లో ఉన్నప్పుడు తల్లిలాంటి పార్టీకే వెన్నుపోటు పొడిచే ప్రయత్నాలు చేశారని, ఈ రోజు బీజేపీలో కూడా అవే పనులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తాము అభ్యర్థిని నిలబెట్టడం లేదని బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటే, దానికి వ్యతిరేకంగా ఒక అభ్యర్థిని ప్రోత్సహించి తన బుద్ధిని బయటపెట్టుకున్నాడని విమర్శించారు. ‘కుక్కతోక వంకర’ అన్నట్లు ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తాడని, అది మరోసారి నిరూపణ జరిగిందన్నారు. ఈ ఎన్నికల్లో ఆయన నైజం, పనిచేసే తీరు బయటపడిందని స్పష్టం చేశారు. బీజేపీ కూడా ఆయన విధానాలపై పునరాలోచన చేసుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ నిర్ణయాలకు ఆకర్శితులై ఇతర పార్టీల ఓటర్లు కూడా తమకు మద్దతుగా ఓట్లు వేశారని, కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి రాబోతున్నదని స్పష్టం చేశారు.
ఎన్నికలు పూర్తయినందున ఇక నుంచి రాజకీయాలు మాట్లాడబోమని, అభివృద్ధిపై దృష్టి పెడతామని మంత్రి స్పష్టం చేశారు. ఇక నుంచి అందరం కలిసి ఉమ్మడి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించే ప్రయత్నం చేద్దామన్నారు. రాజకీయాల గురించి మాట్లాడే అవకాశాన్ని తమకు కల్పించవద్దని విజ్ఞప్తి చేశారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిద్దామని తెలిపారు.
కరీంనగర్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్మగౌరవం పేరిట పచ్చి అబద్ధాలు చెప్పిన నాయకులకు ఎదురు దెబ్బ తగిలింది. తామే గెలుస్తామన్న ధీమాలు, విసిరిన సవాళ్లకు టీఆర్ఎస్ గట్టి షాక్నిచ్చింది. ఎన్నికల్లో కార్పొరేటర్ రవీందర్సింగ్ ఘోర పరాజయం పాలు కాగా, బీజేపీ ఎమ్మెల్యే ఈటలకు చేదు అనుభవం ఎదురైంది. పటాకులు పేల్చి విజయం తనదేనంటూ నమ్మించే ప్రయత్నంచేసిన రవీందర్సింగ్కు కోలుకోలేని దెబ్బ తగులగా.. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా అతన్ని వెంట ఉండి నడిపించి, రవీందర్సింగ్కే ఓటు వేయాలని పిలుపునిచ్చిన ఈటలకు కౌంటర్ పడింది. మొత్తంగా ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఘనవిజయం సాధించగా, కుట్రలు, కుతంత్రాలు పన్ని గెలువాలని చూసిన అభ్యర్థుల చెంప చెల్లుమంది.
టీఆర్ఎస్ టికెట్పై కార్పొరేటర్గా గెలిచిన సర్దార్ రవీందర్సింగ్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. పార్టీ నిబంధనలను కాదని పోటీలో నిలిచిన ఆయన.. ముందు నుంచి తనదే విజయమంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. అంతేకాదు కార్పొరేటర్గా టీఆర్ఎస్ టికెట్పై గెలిచిన విషయాన్ని విస్మరించి.. అదే పార్టీపై తిరుగుబాటు చేయడమేకాదు.. రకరకాల విమర్శలు చేశారు. టీఆర్ఎస్ గుర్తుపై పలుమార్లు కార్పొరేటర్గా గెలిచి, ఐదేళ్ల పాటు మేయర్గా పదవులు అనుభవించిన ఆయన ఈ ఎన్నికల్లో చేసిన విమర్శలను టీఆర్ఎస్ సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలో అతనితో సయోధ్యకు కూడా ప్రయత్నించలేదు. బరిలోనే నిలిచి తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. దీంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ పరిస్థితుల్లో రవీందర్ సింగ్ పలుమార్లు ప్రెస్మీట్ పెట్టి మాటిమాటికీ ఆత్మగౌరవం గురించి మాట్లాడారు. తనకు అన్ని పార్టీల మద్దతు ఉందని, టీఆర్ఎస్లోని చాలా మంది తనకు ఓటు వేస్తారంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. అక్కడితో ఆగకుండా పోలింగ్ పూర్తయిన వెంటనే ఆయనే విజయం సాధిస్తున్నట్లుగా పటాకులు పేల్చి ర్యాలీ తీశారు. నిజంగా రవీందర్సింగ్ గెలుస్తాడా..? అనే విధంగా ఆయన దర్పం చాటారు. తీరా చూస్తే ఘోర పరాజయం పాలయ్యారు. ఆయనకు వచ్చింది 232 ఓట్లు మాత్రమే. అయినా తన ఓటమిని ఒప్పుకోకుండా నైతిక విజయం తనదే అంటూ చెప్పుకోవడం విడ్డూరం.
హుజూరాబాద్ ఎన్నికల్లో సానుభూతితో గెలిచిన ఈటల.. తనకు ఎదురు లేదన్న భావనతో ఊగిపోతున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ నియమనిబంధనలకు విరుద్ధంగా రవీందర్సింగ్కు ఓటు వేయాలంటూ పిలుపునిచ్చారు. తన వాయిస్ను సోషల్ మీడియా ద్వారా అందరికీ పంపించి విస్తృత ప్రచారం చేశారు. అంతేకాదు రవీందర్సింగ్ నిజమైన ఉద్యమకారుడు.. అతన్నే గెలిపించి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటూ హుజూరాబాద్ ఎన్నికల్లో మాట్లాడినట్లుగానే చెప్పారు. నిజానికి ఈ ఎన్నికల్లో బీజేపీ తన అభ్యర్థిని నిలుపలేదు. ఈ విషయాన్ని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. అయితే ఒక జాతీయ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే పార్టీ అధ్యక్షుడి నిర్ణయానికి భిన్నంగా రవీందర్సింగ్కు ఓటు వేయమని చెప్పడం ఆ పార్టీలో ఇప్పటికే చర్చకు దారి తీసింది. ఇది ఇలా ఉంటే ఈటల మాటలను ప్రజాప్రతినిధులెవరూ ఖాతరు చేయలేదు. టీఆర్ఎస్కు అనూహ్య విజయాన్ని అందించడంతో ఈటలకు చేదు అనుభవం ఎదురైంది. అంతేకాదు హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రజలు నన్ను గెలిపించారు.. నేను ఏది చెప్పినా నడుస్తుందంటూ భావిస్తున్న ఈటలకు విభిన్నమైన తీర్పును ఇచ్చి చెంపచెల్లుమనిపించారు. హుజూరాబాద్ రాజకీయాలు వేరు.. ఇతర ప్రాంతాల్లో రాజకీయాలు వేరు అన్నది చాటి చెప్పారు. రవీందర్సింగ్ గెలుపుకోసం ఈటల అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ఎమ్మెల్యేగా ఎన్నికైన కొద్దిరోజులకే అపజయాన్ని మూట కట్టుకున్నారు.