మంచిర్యాల, జూన్ 10, నమస్తే తెలంగాణ : ఆడబిడ్డల కండ్లలో ఆనందం చూసేందుకే పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టాం. పండుగ లాంటి వాతావరణంలో రెండో విడత సింగరేణి ఇండ్ల పట్టాల పంపిణీకి తాను రావడం చాలా ఆనందంగా ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
శుక్రవారం జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలోని సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన రెండో విడత పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సింగరేణి భూముల క్రమబద్ధీకరణ చేయాలని 2009లో సమైక్య రాష్ట్రంలో ఎంత మొత్తుకున్నా పట్టించుకోలేదన్నారు.
స్వరాష్ట్రంలో జీవో 76 కోసం విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ పోరాటం చేసి సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఇండ్ల పట్టాలు అందిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో దండాలు, దరఖాస్తులతో ప్రజలు విసిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
నాడు దరఖాస్తులు ఇచ్చిన చేతులతోనే నేడు పట్టాలు ఇస్తున్నామన్నారు. తెలంగాణ వస్తే ఏమొస్తది అనేవారికి ఇంతకన్నా ఏం సమాధానం కావాలని ప్రశ్నించారు. కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, గురుకుల విద్యతో పాటు పలు పథకాలతో బిడ్డల బంగారు భవిష్యత్తుకు అందిస్తున్న సీఎం కేసీఆర్కు దీవెనార్థాలు అందించాలని కోరారు.
కాంగ్రెస్ వాళ్లు ఢిల్లీకి ఏజెంట్లు.. బీజేపీ వాళ్లు గుజరాత్ బానిసలు : బాల్క సుమన్
కాంగ్రెస్, బీజేపీలు రాజకీయాలు కలుషితం చేసి ప్రజల్లో విషబీజాలు నాటుతున్నారని, రెండు పార్టీలు కలిసి కేసీఆర్ను విమర్శించడం విడ్డూరంగా ఉందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వాళ్లు ఢిల్లీకి ఏజెంట్లని, బీజేపీ వాళ్లు గుజరాత్ బానిసలని విమర్శించారు. సింగరేణిలో 16 వేల మందికిపైగా తండ్రుల ఉద్యోగాలు బిడ్డలకు అందేలా చేసింది కేసీఆర్ కృషేనన్నారు.
సింగరేణిలోని బొగ్గు బ్లాకులను అమ్మాలని బీజేపీ ప్రభుత్వం చూస్తే, ఎదురొడ్డి ఆ బొగ్గు బ్లాకులకు వేలం వేయకుండా అడ్డుకున్నామన్నారు. ఈ విషయాన్ని ప్రజలు సైతం గమనించి, తెలంగాణ పార్టీ చేస్తున్న అభివృద్ధిని గ్రహించి అందరికీ తెలియజేయాలన్నారు. ఈ పంపిణీ ప్రక్రియ పూర్తయితే ఐదు వేల మందికిపైగా మహిళలకు పట్టాలు అందుతాయని, వారంతా రూపాయి లేకుండా సొంతింటి యాజమానులుగా మారనున్నారన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగురామన్న, రాజ్య సభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండె విఠల్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేణుకుంట్ల ప్రవీణ్, జిల్లా కలెక్టర్ భారతీ హోళీకేరీ, అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్, మున్సిపల్ చైర్ పర్సన్ కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, టీఆర్ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, తదితరులు పాల్గొన్నారు.