మహబూబాబాద్ : జిల్లాలోని తొర్రూర్ డివిజన్ కేంద్రంలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జిల్లా కలెక్టర్ కె.శశాంకతో కలిసి ప్రారంభించారు. ఆరోగ్య మేళాలో ఏర్పాటు చేసిన 11 స్టాల్స్ ను సందర్శించి అందిస్తున్న వైద్య వివరాలు, వాటి ప్రత్యేకతలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
నాణ్యమైన వైద్యం అందించాలని మంత్రి వైద్య అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఆజాది కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో ఆరోగ్య మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేళాలో భాగంగా మధుమేహం, రక్తపోటు, క్షయ, కంటి, చెవి, ముక్కు, గొంతు పరీక్షలు, దంత, చర్మ సంబంధిత వ్యాధులకు, కుష్టు, మలేరియా, అంధత్వ నివారణ పరీక్షలు నిర్వహిస్తారన్నారు.
మాతా శిశు సంరక్షణ, ఆరోగ్య సంరక్షణ, పొగాకు వినియోగం దుష్ఫలితాలు, అంధత్వ నివారణ పై అవగాహన కల్పిoచి, ఉచితంగా మందులు అందజేస్తామన్నారు. మెగా క్యాంప్ లో నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి శాశ్వత హెల్త్ కార్డు అందజేస్తారని మంత్రి పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.