హైదరాబాద్ : శాసససభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మిషన్ భగీరథ కింద తాగునీరు ఎన్ని గ్రామాలకు సరఫరా చేస్తున్నారని సభ్యులు అడిగిన ప్రశ్నలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమాధానం ఇచ్చారు. రాష్ర్ట వ్యాప్తంగా మిషన్ భగీరథ పథకం కింద 24,543 గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నామని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేశామని స్పష్టం చేశారు.
ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన ఆదివాసీ గ్రామాలకు కూడా నీరు అందిస్తున్నాం. మొత్తం 74 ఆదివాసీ శివారు గ్రామాలకు మిషన్ భగీరథ సరఫరా చేస్తున్నామని తెలిపారు. కొన్ని చోట్ల జాతీయ రహదారుల పనుల వల్ల పనుల్లో కొంచెం ఆలస్యం జరుగుతుందన్నారు. చిన్నచిన్న ఆవాస గ్రామాలకు కూడా నీళ్లు ఇస్తున్నాం. ఇంకా ఏమైనా సమస్యలున్నా పరిష్కరించుకుందామని చెప్పారు.
మిషన్ భగీరథ జలాల పంపిణీపై సమీక్షలు నిర్వహించాలని ఎమ్మెల్యేలకు ఇప్పటికే లేఖలు రాశాను అని తెలిపారు. కరెంట్ లేని ప్రాంతాల్లో సోలార్ పవర్ ద్వారా నీళ్లు సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. కుండలు, బిందెల ప్రదర్శనలు ఇప్పుడు లేవన్నారు. ఈ పథకానికి ముఖ్యమంత్రే ఇంజినీర్. వారి డైరెక్షన్లోనే ఈ పథకం అమలవుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.