హైదరాబాద్ : రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం వరంగల్లో దశాబ్దాలుగా ఉద్యమం జరుగుతోందని, కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ మోసం చేశాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. సోమవారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో చీఫ్విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ పోచం పల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోచ్ ఫ్యాక్టరీ వరంగల్, తెలంగాణ ప్రజల హక్కు అన్నారు. విభజన చట్టంలో కేసీఆర్ పట్టుబట్టి కోచ్ ఫ్యాక్టరీ ప్రతిపాదన పెట్టించారన్నారు.
కోచ్ ఫ్యాక్టరీతో పాటు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు కూడా విభజన చట్టంలో ఉన్నాయని మంత్రి ఎర్రబెల్లి గుర్తు చేశారు. ఈ మూడు ప్రధాన హామీలను కేంద్రం తుంగలో తొక్కిందని, ఈ హామీలను సాధించకుండా బీజేపీ నేతలు సిగ్గూ శరం లేకుండా పాదయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. కోచ్ ఫ్యాక్టరీ సాధించాకే బీజేపీ నేతలు తెలంగాణలో తిరగాలన్నారు. తెలంగాణకు బీజేపీ నేతలు ఏం చేయకున్నా ఫర్వాలేదు కానీ.. చెడగొడుతున్నారని, తెలంగాణకు మెడికల్ కాలేజీల కేటాయింపుల్లోనూ కేంద్రం అన్యాయం చేసినా బీజేపీ నేతలు పట్టించుకోవడం లేదంటూ ధ్వజమెత్తారు.
మహారాష్ట్ర లాతూర్కు రైల్వేకోచ్ ఫ్యాక్టరీ తరలినా బీజేపీ నేతలు మాట్లాడడం లేదని, మాయమాటలు బంద్ చేసి కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులపై పోరాడాలని హితవు పలికారు. కేంద్రం బీజేపీ పాలిత రాష్ట్రాలకే ప్రాధాన్యం ఇస్తోందని, తెలంగాణ పట్ల బీజేపీ ప్రభుత్వం వివక్ష ఇంకెనాళ్లని ప్రశ్నించారు. ఏ మొహం పెట్టుకుని ఆ పార్టీ నేతలు తెలంగాణలో తిరుగుతారన్నారు. రైతులను సైతం కేంద్రం మోసం చేస్తోందని, వరి దొడ్డు రకాలు కొనమని చెప్పడం అన్నదాతలను దగా చేయడమేనన్నారు. ఈ విషయంలో ఏం చేయాలనేది ఆలోచిస్తామని, రైస్ మిల్లులు మూతపడే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాజీపేటకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్కు తరలిస్తే ఇప్పుడు బీజేపీ లాతూర్కు తరలించిందని చీఫ్విప్ వినయ్ భాస్కర్ విమర్శించారు. బండి సంజయ్ పాదయాత్రను ఢిల్లీ వైపు మార్చి తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులపై పోరాడాలని సూచించారు. సంజయ్ చేస్తున్నది ప్రజా సంగ్రామ యాత్ర కాదు.. తెలంగాణ వంచన యాత్ర అని విమర్శించారు. పాదయాత్రకు ముందే కోచ్ ఫ్యాక్టరీపై మాట్లాడాలని, లేదంటే ప్రజలే సంజయ్ని ప్రతిఘటిస్తారన్నారు.
బీజేపీకి తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. కోచ్ ఫ్యాక్టరీకి తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయించిందన్నారు. ఇకపై తెలంగాణలో బీజేపీకి పుట్టగతులుండవన్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ దొంగచాటున రైల్వేకోచ్ ఫ్యాక్టరీని కేంద్రం మహారాష్ట్రలోని లాతూర్కు తరలించిందని, హుజూరాబాద్కు బీజేపీ నేతలు ఏం ముఖం పెట్టుకొని వస్తారన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెచ్చిన తర్వాతనే బీజేపీ నేతలు బయట తిరిగాలని, హుజూరాబాద్లో బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు.