టీఆర్ఎస్ వెంటే పట్టభద్రులు, ఉద్యోగులు
మంత్రి ఎర్రబెల్లి
హన్మకొండ, మార్చి 21: తెలంగాణలో కాంగ్రెస్ భూ స్థాపితమైందని, బీజేపీ లేచేది లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఎద్దేవా చేశారు. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచిన సందర్భంగా ఆదివారం ఆయన హన్మకొండలో ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్యేలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో మాట్లాడారు. ప్రజలు, పట్టభద్రులు, ఉద్యోగుల మద్దతు ఉన్నందునే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీతో గెలిచామన్నా రు. బీజేపీ, కాంగ్రెస్లను కాదనుకొని రెండు, మూడు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు ఉండేలా పట్టభద్రులు ఓట్లు వేశారని తెలిపారు. ఈ విషయంలో ఆయా పార్టీల నాయకత్వాలు విశ్లేషించుకోవాలని మంత్రి సూచించారు. ఓటర్లు ఎందుకు ఛీ కొడుతున్నారో అర్థం చేసుకోవాలన్నారు. మొదటి రౌండ్ నుంచే టీఆర్ఎస్ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్రెడ్డి, వాణీదేవి ఆధిక్యతను చాటారని గుర్తుచేశారు.
ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు ఇవ్వలేదంటే ప్రజల్లో ఆయా పార్టీలకున్న స్థానం ఏమిటో తెలుసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ పాలనను పట్టభద్రులు, ఉద్యోగులు అర్థం చేసుకున్నారని, అందుకే టీఆర్ఎస్కు అండగా నిలిచారని తెలిపారు. ఇప్పటికైనా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పిచ్చిపిచ్చి మాటలు మానుకోవాలని మంత్రి హితవు పలికారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరించిన పట్టభద్రులు, ఉద్యోగులకు ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, నన్నపనేని నరేందర్, జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి, రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.