నిజామాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గవర్నర్ వ్యవస్థను రాజకీయంగా వాడుకోవడం మంచిది కాదని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హితవు పలికారు. గతంలో ఎన్టీఆర్ను అవమానించిన అప్పటి గవర్నర్పై ప్రజలు తిరగబడ్డారని, ముఖ్యమంత్రి కేసీఆర్ను అవమానపరిచేలా వ్యవహరిస్తే తెలంగాణ ప్రజలు సహించబోరని పేర్కొన్నారు. కేసీఆర్ దేశ రాజకీయాల వైపు వెళ్తున్నారు.. పార్టీ పెట్టబోతున్నారని వార్తలు రాగానే బీజేపీ వాళ్లకు వణుకు మొదలయ్యిందని ఎద్దేవాచేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ ఉలికిపాటుకు గురయ్యారని చెప్పారు. నోటికొచ్చినట్టు పిచ్చికూతలు కూశారని మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే గుణపాఠం తప్పదంటూ హెచ్చరించారు.
శనివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితో కలిసి దయాకర్రావు పలు గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాయంత్రం జిల్లాకేంద్రంలోని టీఆర్ఎస్ నూతన కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ తోపేమీ కాదని మంత్రి వేముల పేర్కొన్నారు. ఈ దేశానికి ఆయన చేసిందేమీ లేదన్నారు. ప్రధానిగా దేశాన్ని మోదీ అగ్రస్థానంలో నిలబెట్టిండని బీజేపీవాళ్లు చెప్పడం పెద్ద జోక్ అని చెప్పారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మనిషా.. పశువా? అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ వచ్చినప్పుడు రూపాయికి డాలర్ విలువ ఎంత, ఇప్పుడెంతనో తెలుసా? అని ప్రశ్నించారు. 2014లో ఒక డాలర్కు మారకం విలువ రూ.55 ఉంటే నేడు రూ.80కి పతనమైందని తెలిపారు. అగ్రస్థానం అంటే ఏంది? అతను ఓ పార్టీ అధ్యక్షుడా? ఒక ఎంపీయేనా? బండికి బుద్ది ఉందా? అని నిప్పులు చెరిగారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు వృద్ధి రేటుతో పోలిస్తే ఇప్పుడు సగానికి పడిపోయింది నిజం కాదా? అని ప్రశ్నించారు.
నిరుద్యోగ రేటు, ఆకలి సూచికలో భారత్ కనిష్ఠానికి పడిపోయిందన్నారు. ఆకలి సూచిలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ కంటే భారత్ చిట్టచివరలో ఉండటం మోదీ గొప్పతనమేనంటూ చురక వేశారు. ఆస్ట్రేలియాలో అదానీకి బొగ్గు బిజినెస్ నడుస్తలేదని సింగరేణిలో రూ.4 వేలలోపు దొరికే బొగ్గును బలవంతంగా రాష్ర్టాలకు రూ.30 వేలకు టన్ను చొప్పున అంటగడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ర్టానికి నిధుల మంజూరులో కేంద్రం కావాలనే తాత్సారం చేస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ పల్లెల్లో కనిపిస్తున్న ప్రగతి నమూనా దేశంలో మరెక్కడా లేదని అభివర్ణించారు. ఇటీవల కామారెడ్డి జిల్లాకు వచ్చిన కేంద్ర బృందాలు వైకుంఠధామాలను పరిశీలించాయని, ఎక్కడా లోపాలు, తప్పులు దొరకకపోవడంతో వెనుదిరిగారని చెప్పారు. కావాలనే కిరికిరి పెడుతూ నిధులు ఆపేసేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు.
బండి కాదు.. తొండి సంజయ్
హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బండి సంజయ్ కాదని, ఆయన ఓ తొండి సంజయ్ అని విమర్శించారు. లక్ష్మణ్కు రాజ్యసభ సీటును బీజేపీ ప్రేమతో ఇవ్వలేదని, కేసీఆర్ దేశ రాజకీయాల్లో బలపడుతున్నారని భయపడి ఇచ్చిందని శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి కనిపించకపోతే.. మిషన్ భగీరథ, రైతుబంధు ఎందుకు కాపీ కొట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్కు మెడికల్ కళాశాల తెచ్చుకోలేని సన్యాసి బండి సంజయ్ అని, బాండ్ పేపర్ రాసిచ్చి పసుపు బోర్డు తెచ్చుకోలేని ఎంపీ అర్వింద్ ఓ దద్దమ్మ అని మండిపడ్డారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు లేఖలు రాసి.. ఉపాధి హామీ నిధులు రూ.1,400 కోట్లు రాష్ట్రానికి రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు. బీజేపీ ఎంపీలకు దమ్ముంటే ఉపాధి హామీ నిధులను తీసుకురావాలని సవాల్ విసిరారు.