హైదరాబాద్ : రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద రాష్ట్రంలో కొత్తగా వెయ్యి నూతన పంచాయతీ భవనాలు మంజూరు చేసి, నిధులు విడుదల చేయాలని.. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరి రాజ్ సింగ్ను కోరారు.
గురువారం హైదరాబాద్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి గిరి రాజ్ సింగ్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రితో రాష్ట్ర ప్రగతి పై మాట్లాడారు.
ఈ మేరకు కేంద్ర మంత్రికి మూడు అంశాలకు సంబంధించిన లేఖలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..శ్యాం ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ పనులను రాష్ట్రంలో పునరుద్ధరించాలన్నారు.
రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న పంచాయతీ రాజ్ నూతన భవనాలకు ప్రస్తుతం ఉపాధి హామీ కింద ఇస్తున్న రూ.20 లక్షల నిధులను రూ.25 లక్షలకు పెంచాలని కోరినట్లు ఆయన వివరించారు. అలాగే రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద రాష్ట్రంలో కొత్తగా వెయ్యి నూతన పంచాయతీ భవనాలు మంజూరు చేసి, నిధులు విడుదల చేయాలని కోరినట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.