హైదరాబాద్ : పామాయిల్ సాగులో వరంగల్ జిల్లా రైతులు రాష్ట్రానికే ఆదర్శంగా నిలువాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. పర్వతగిరి మండల కేంద్రంలోని మంత్రి తన వ్యవసాయ క్షేత్రంలో పది ఎకరాల్లో 570 పామాయిల్ మొక్కలను కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి నాటారు. అనంతరం ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పామాయిల్ సాగుపై అధికారులు ఏర్పాటు చేసిన రైతుల అవగాహన సదస్సులో మంత్రి పాల్గొని మాట్లాడారు.
పామాయిల్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు కల్పిస్తుందని మంత్రి తెలిపారు. చీడపీడలు, ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఈ పంట రైతుకు మేలు చేస్తుందని, ఏమాత్రం నష్టం చేయదని మంత్రి స్పష్టం చేశారు. స్వయంగా తానే పామాయిల్ను సాగు చేస్తున్నానన్నారు. రాష్ట్ర రైతాంగమంతా పామాయిల్పై దృష్టిపెట్టాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆయిల్ పామ్ సాగుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. రైతులు సాగునీటి సమస్యతో ఇబ్బందులుపడ్డారనీ, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 365 రోజులు నీటి సరఫరా ఉంటుందన్నారు.
దీంతో భూమి తేమశాతం పెరిగిందని, గతంలో ఆంధ్రాలో ఇలాంటి తోటలతో కళకళలాడేదన్నారు. రైతులకు పంట సాగుతో ఎకరాకు 2లక్షల వరకు ఆదాయం వస్తుందన్నారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 30 నెలల్లో క్రాడ్తో 30 ఏండ్ల పాటు ఆదాయం ఉంటుందని తెలిపారు. జిల్లాలో పదివేల ఎకరాల సాగుకు ప్రయత్నించగా.. 12వేల ఎకరాలకుపైగా రైతుల నుంచి దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. సబ్సిడీతో పాటు బ్యాంకు రుణాలు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని మంత్రి తెలిపారు. జిల్లావ్యాప్తంగా రైతులకు అవగాహన కల్పించి, సాగు పెరిగేలా అధికారులు కృషి చేయాలని దయాకర్రావు అధికారులను ఆదేశించారు.