హైదరాబాద్ : పల్లెల్లో పారిశుధ్యం మెరుగుపడాలని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మొక్కలు నాటారు. అనంతరం గ్రామంలో వాడవాడలా పర్యటించి పారిశుధ్యం, వీధి దీపాలు, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. గ్రామంలో పారిశుధ్యం నిర్వహణ మరింత మెరుగవ్వాలని సూచించారు.
అనంతరం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భగా అంశాలవారీగా సమీక్షించారు. గ్రామంలో ట్రాక్టర్ ఎన్ని గంటలకు వస్తున్నది? సమయానికి చెత్త సేకరణ సక్రమంగా జరుగుతున్నదా? డంపింగ్ యార్డు వినియోగిస్తున్నారా? చెత్తను ఎరువుగా తయారు చేస్తున్నారా? పంచాయతీకి ఎంత ఆదాయం వస్తున్నది? తదితర పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, అధికారులు, సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.