అమరావతి, మే 29: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నిర్వహించిన 43వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఫుట్వేర్, గార్మెంట్స్ వంటి చిన్న తరహా పరిశ్రమలపై ప్రతిపాదించిన పన్ను పెంపును తాత్కాలికంగా సస్పెండ్ చేయాలని కోరారు. ఏపీలో సంపూర్ణ లాక్డౌన్ విధించనప్పటికీ.. కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తోన్నామని, ఫలితంగా గ్రామీణ స్థాయిలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలపై ప్రభావం పడిందని పేర్కొన్నారు.
అలాగే సకాలంలో పన్నులను చెల్లించని వ్యాపారస్తులపై జరిమానా రూపంలో విధించే మధ్యంతర అధిక వడ్డీ మొత్తాన్ని కూడా తగ్గించాలని బుగ్గన సూచించారు. లాక్డౌన్ తరహా పరిస్థితుల వల్ల వ్యాపారాలు దెబ్బతిన్నాయని వివరించారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం కూడా తగ్గిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన జీఎస్టీ బకాయిల గురించి బుగ్గన ఈ భేటీలో ప్రస్తావించారు. రాష్ట్రాలకు మరింత ఆర్థిక సహాయన్ని అందించడానికి ఇంతకంటే మంచి సమయం లభించకపోవచ్చని ఆయన నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు. కోవిడ్ను ఎదుర్కొనడానికి అవసరమైన నిధులను కూడా అడ్వాన్స్గా విడుదల చేయాలని సూచించారు.