అమరావతి : జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్పై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సినిమా టికెట్ల విషయంలో నియంత్రణ లేకుండా పోతుందని, ధరలను ఇష్టానుసారంగా పెంచి, ప్రజలపై భారం వేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. సినిమా టికెట్ల విక్రయాల ఆన్లైన్ విధానాన్ని సినీ డిస్ట్రిబ్యూటర్లే కోరారని స్పష్టం చేశారు. వారికి లేదని బాధ పవన్కు ఎందుకన్నారు.
వైఎస్సార్ సీపీ మంత్రులు సన్నాసులైతే.. పవన్ ఋషి పుంగవుడా? అని ప్రశ్నించారు. ‘నోరుందని పవన్ ఇష్టానుసారంగా మాట్లాడతారా? ఇబ్బందులుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. చిత్ర పరిశ్రమలో పవన్తో పాటు చాలా మంది ఉన్నారు. చిరంజీవి, మోహన్బాబు వంటి పెద్దలు ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చు. ప్రభుత్వం మంత్రుల గురించి మాట్లాడేటప్పుడు అదుపులో ఉండాలి’ అన్నారు. ఇది రిపబ్లిక్ ఇండియా కాబట్టి.. ఇష్టానుసారంగా మాట్లాడితే కుదరదన్నారు. ఏపీ కేబినెట్ విస్తరణ వార్తలపై స్పందించారు. మంత్రివర్గ విస్తరణ అనేది సీఎం ఇష్టమని.. ఆయన నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.