అమరావతి : ఏపీలోని అమరావతి రైతుల్లోని కోటీశ్వరులు కొవ్వెక్కి పాదయాత్ర చేస్తున్నారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బలుపెక్కి పాదయాత్రలు చేస్తున్నారని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దూమరం లేపగా ఇవాళ మరోసారి మంత్రి పాదయాత్రపై విరుచుకు పడ్డారు. ఏపీలో అమరా వతి రాజధాని రైతులు దేవుణ్ని అడ్డం పెట్టుకుని పాదయాత్రల పేరిట నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. విజయవాడలోని దుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు.
వైసీపీ ప్రభుత్వ విధానం వికేంద్రీకరణకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కేవలం రాష్ట్రంలోనే కాదు పంచాయతీల్లోనూ తమ పాలసీ కొనసాగుతుందని అన్నారు. సామాన్యుడికి పరిపాలన అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల నిర్ణయానికి పాల్పడితే ప్రతిపక్ష టీడీపీ నాయకులు రైతుల ముసుగులో అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.