వరదలతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయంగా రూ.10 వేలను అందజేస్తుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్కుమార్ పేర్కొన్నారు. భద్రాచలం పట్టణంతోపాటు దుమ్ముగూడెం, పర్ణశాల ప్రాంతాల్లో గోదావరి వరదతో ముంపునకు గురైన ప్రాంతాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. భద్రాచలంలోని ముంపు కాలనీలు, కరకట్ట, మిథిలా స్టేడియం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను ఆప్యాయంగా పలకరించి భరోసా కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని వరద బాధితులను ఓదార్చారు. ముంపు తగ్గాక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున అధికారులు పారిశుధ్య చర్యలు చేపడుతున్నారని, వైద్య శిబిరాలు సైతం ఏర్పాటు చేస్తున్నారన్నారు.
భద్రాచలం/ దుమ్ముగూడెం/ పర్ణశాల, జూలై 22: ‘వరద బాధితులెవరూ అధైర్య పడొద్దు. అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుంది.’ అంటూ ధైర్యం చెప్పారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్. భద్రాచలం పట్టణంతోపాటు దుమ్ముగూడెం, పర్ణశాల ప్రాంతాల్లో ఇటీవల వచ్చిన గోదావరి వల్ల ముంపునకు గురైన ప్రాంతాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. భద్రాచలంలోని ముంపు కాలనీలు, కరకట్ట, మిథిలా స్టేడియం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికీ తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేలను అందజేస్తోందని అన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారని అన్నారు.
అనంతరం ఐటీడీఏ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఖమ్మం, కొత్తగూడెం కలెక్టర్లు వీపీ గౌతమ్, అనుదీప్, ఐటీడీఏ పీవో గౌతమ్ పొట్రు, ఎస్పీ వినీత్, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్యలతో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వరద ముంపునకు గురైన ప్రతి కుటుంబానికీ పరిహారం, నిత్యావసర వస్తువులు అందజేస్తామని తెలిపారు. ముంపు కుటుంబాల గణన లెక్కింపులో సీసీఎల్ఏ డైరెక్టర్ రజత్కుమార్ షైనీ, పంచాయతీ రాజ్ కమిషనర్ హనుమంతరావు, ఖమ్మం కలెక్టర్ గౌతమ్, సీపీ విష్ణు, ఎస్పీ వినీత్, ఐటీడీఏ పీవో గౌతమ్, ఏఎస్పీ రోహిత్రాజ్ నిమగ్నమయ్యారని అన్నారు.