నల్గొండ: గట్టుప్పల్ మండలం ఏర్పాటు చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్పేందుకు ఏర్పాటు చేసిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న గట్టుప్పల్ మండల ఏర్పాటు కల నెరవేరిందని, రాజగోపాల్ రెడ్డి చేసిన చర్యల వల్లే గట్టుప్పల్ మండల ఏర్పాటు అప్పట్లో ఆగిపోయిందని విమర్శించారు.
సీఎం కేసీఆర్ గురించి మాట్లాడే స్థాయి రాజగోపాల్ రెడ్డికి ఉందా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ను 300 సార్లు పార్టీలోకి వచ్చేందుకు అవకాశం ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి అడిగాడన్నారు. కేసీఆర్ను ఓడించే దమ్ము ధైర్యం నీకుందా? అని సవాల్ చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకుని వందల కోట్లు సంపాదించింది నిజం కాదా? అని అడిగారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అమ్ముకుని, కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి కేసీఆర్పై విమర్శలు చేస్తున్నావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు ఉందని ఏది పడితే అది మాట్లాడితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.