కరీంనగర్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ సరికొత్త కార్యక్రమానికి అంకురార్పణ జరుగబోతున్నది. జిల్లాను పోషకాహారలోప రహితంగా తీర్చిదిద్దాలన్న మంత్రి కేటీఆర్ మార్గదర్శనం, కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రత్యేక చొరవతో నేటి నుంచి ‘మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్’ ప్రారంభం కాబోతున్నది.
ప్రతి నెలా రెండో శనివారం 587 అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన 36 వేల మంది పిల్లలకు బలవర్ధకమైన చిరుధాన్యాల ఆహారం అందించనున్నారు. ఒక్కొకరికి 30 గ్రాముల రాగి లడ్డ్డూను ఇవ్వనుండగా, రాగి పిండికి బెల్లం, నెయ్యిని కలిపి వీటిని తయారు చేస్తున్నారు. ఒక్కో లడ్డూకు సుమారు 8 నుంచి 10 వరకు ఖర్చు చేయనున్నారు. స్థానిక సంస్థల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం వెనుక పోషకాహారలోపం నివారించడమే కాదు, స్థానిక రైతులను చిరుధాన్యాల సాగువైపు మళ్లించే లక్ష్యం కూడా ఉందని అధికారులు చెబుతున్నారు.