Gold | చాలా మంది ఆన్లైన్లో బంగారం కొనుగోళ్లు చేయాలంటే రిస్క్ అని భావిస్తారు. ఆన్లైన్లో కొనుగోలు చేయడం వల్ల పన్ను పే చేయాల్సి ఉంటుంది. అందువల్లే చాలా మంది ఆఫ్లైన్లోనే బంగారం కొనుగోళ్లకు మొగ్గుతుంటారు. కానీ పరిస్థితి క్రమంగా మారుతున్నది. మిలియనిల్స్ తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా ఆన్లైన్లోనే బంగారం కొనుగోళ్లు జరిపేస్తున్నారు. దీనికి 2020 నుంచి 2021 వరకు అమల్లో ఉన్న కొవిడ్-19 ఆంక్షలు కూడా ఒక కారణమే అని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) పేర్కొంది. ఇప్పటికీ ఆన్లైన్లో బంగారం కొనుగోళ్లు కేవలం 3-5 శాతం మాత్రమే, కానీ, వచ్చే ఐదేండ్లలో అది 7-10 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది.
ఆన్లైన్ కొనుగోలు దారులు 18 క్యారట్ల బంగారంలో లైట్ వెయిట్ డైలీ వేర్, ఫ్యాషన్ జ్యువెలరీ కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇస్తారని డబ్ల్యూజీసీ పేర్కొంది. దేశంలోని ఆకర్షణీయ జ్యువెల్లరీ మార్కెట్లో మూడో వంతు చైన్ స్టోర్లేనని తెలిపింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.3.6 లక్షల కోట్ల (46.14 బిలియన్ డాలర్లు) విలువైన బంగారం దిగుమతైంది. 2020-21తో పోలిస్తే 33 శాతం ఎక్కువ అని డబ్ల్యూజీసీ తెలిపింది. దేశ జీడీపీలో బంగారం పరిశ్రమ వాటా 1.3 శాతం మాత్రమే.
2014-15 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రిటైల్ బంగారం వ్యాపార సంస్థల సంఖ్య 50 శాతం నుంచి 2020-21 నాటికి 37 శాతానికి పడిపోయిందని డబ్ల్యూజీసీ వివరించింది. చిన్న జ్యువెల్లరీ సంస్థల మార్కెట్ షేర్ను బ్రాండెడ్ చైన్ స్టోర్లు పెంచుకుంటున్నాయి. నియంత్రణ నిబంధనలు అమల్లోకి రావడంతో కొనుగోలు దారులు కూడా చిన్న బంగారం దుకాణాల నుంచి బ్రాండెడ్ చైన్ బంగారం షాపులకు మళ్లుతున్నారని డబ్ల్యూజీసీ పేర్కొంది.