ఎగబాకుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు
గగ్గోలు పెడుతున్న సామాన్య జనం
9 నెలల్లో రూ.20.57 పెరుగుదల
ఫిబ్రవరిలోనే రూ.5 పెంపు
రవాణా, సరుకుల ధరలపై తీవ్ర ప్రభావం
కరోనాతో కుదేలైన రంగాలకు మరింత దెబ్బ
కొన్ని రాష్ర్టాల్లో సెంచరీ చేరువలో పెట్రోలు
చమురు ధరలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. హద్దు లేకుండా పెరుగుతుండడంతో అన్నివర్గాలు కుదేలవుతున్నాయి. గాడి తప్పుతున్న రేట్లతో తమ బతుకు బండి ఆగమవుతుందని దిగులు చెందుతున్నాయి. కేవలం 9 నెలల్లో దాదాపు రూ.20 వరకు పెరగగా, ఒక్క ఫిబ్రవరిలోనే రూ.5 పెరిగి ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటికే కొన్ని రాష్ర్టాల్లో పెట్రోలు వందకు చేరువలో ఉండగా, అతి సమీపంలో నగరంలో కూడా సెంచరీ మోగనుందని పెరుగుదలను బట్టి అర్థమవుతున్నది. కరోనా ప్రభావంతో సొంత వాహనాలు వినియోగిస్తున్న వారి బడ్జెట్ అంచనాలు తలకిందులవుతుండగా, డీజిల్ ధరలతో రవాణా, సరుకుల ధరలు పెరిగే ప్రమాదమున్నది. ఇప్పటికే వ్యాపారులు కొందరు చమురు ధరల బూచి చూపి రేట్లు పెంచినట్లు తెలుస్తున్నది. దీనికితోడు నగరంలో ఒక్కో బంకులో ఒక్కో రకంగా విక్రయిస్తుండడం గమనార్హం. ప్రధానంగా ప్రభుత్వ రంగ కంపెనీలతోపాటు ప్రైవేటు కంపెనీలు రోజుకోరకంగా విక్రయిస్తున్నట్లు వాహనదారులు మండిపడుతున్నారు. ఇదేందని ప్రశ్నిస్తే..పెరిగింది పైసల్లోనే కదా అని బదులిస్తున్నారని వాపోతున్నారు.పైసా.. పైసా.. పెరుగుతూ వస్తున్న పెట్రో ధరలు పేద ప్రజలను కలవరపెడుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు భారం వివిధ రూపాల్లో ప్రజల నెత్తినపడుతున్నది. తొమ్మిది నెలల్లోనే లీటర్ పెట్రోల్, డీజిల్ ధర రూ.20లు పెరిగింది. దీంతో నిత్యావసర సరుకుల నుంచి మొదలుకొని మారుమూల ప్రాంతాల్లోని రైతు వరకూ ఆ ప్రభావం ఉంటుందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా పెరిగితే దేశంలో సంక్షోభం వచ్చే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చమురు ధరలు రికార్డు స్థాయికి చేరుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలనే డిమాండ్ ప్రజల నుంచి వస్తున్నది.
9 నెలల్లో రూ.20.57 పెరుగుదల
దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు 9 నెలలుగా పెరుగుతూనే ఉన్నాయి. జూన్ 7వ తేదీ 2020న పెట్రోల్ ధర రూ. 73.97పైసలు ఉంటే 8న రూ.75.22 పైసలుగా పెరిగింది. డీజిల్ ధర జూన్ 7న రూ.67.82పైసలు ఉంటే , 8వ తేదీన రూ.69.00 పైసలకు పెరిగింది. ఇలా ఒక్క రోజులోనే డీజిల్ ధర లీటర్కు రూ. 1.18 పైసలు పెరిగింది. అదేవిధంగా పెట్రోల్ రూ.1.25 పైసలు పెరిగింది. ఇక అప్పటి నుంచి ప్రతి రోజు, ప్రతి నెలా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయే తప్ప ఎక్కడా తగ్గిన దాఖలాలు లేవు. ప్రతి రోజు పది, ఇరవై పైసలు చొప్పున పెరుగుతూ తొమ్మిది నెలల్లో ఏకంగా రూ.20.57లు పెట్రోల్పై పెరగగా, డీజిల్పై ఒకేసారి రూ.20.87 పైసలు పెరిగింది.
డీజిల్ రూ.5.23 పైసలు భారం..
రవాణా వాహనాలకు డీజిల్ ఇంధనమే చాలా ముఖ్యం. అలాంటి డీజిల్ ధర సైతం పెట్రోల్తో పోటీ పడుతున్నది. ఫిబ్రవరి 1న లీటర్ డీజిల్ ధర రూ. 83.46 పైసలు ఉంటే, 23న రూ.88.69 పైసలుగా ఉంది. దీంతో కేవలం 23 రోజుల్లోనే ఒక లీటర్ డీజిల్పై ఏకంగా రూ.5.23 పైసలు పెరిగింది.
పెరుగుతున్న ధరలపై కేంద్రం స్పందన ఇది..
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ఉత్పత్తి తగ్గడంతోనే ఇంధన ధరలు పెరుగుతున్నాయంటూ కేంద్ర పెట్రోలియం శాఖ పేర్కొంటోంది. అంతకుముందు కేంద్ర ఆర్థిక మంత్రి చమురు ధరల పెరుగుదల ప్రభుత్వ నియంత్రణలో లేదని తేల్చి చెప్పారు. చమురు ధరలు తగ్గడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇలా కేంద్ర ప్రభుత్వ పెద్దలే ఒకరి తర్వాత ఒకరు ప్రకటనలు చేస్తున్నారే తప్ప, ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడానికి మాత్రం నిరాకరిస్తున్నారు.
23 రోజుల్లో పెట్రోల్పై రూ.4.77 పైసలు పెరుగుదల
రోజువారీ ధరల పెరుగుదల పైసల్లో ఉంటే ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. అదే నెల రోజులను పరిగణలోకి తీసుకుంటే ఒక్కసారిగా రూ.4 నుంచి రూ.5లుగా ఉంటోంది. అందుకు నిదర్శనం 2021 ఫిబ్రవరి 1వ తేదీన లీటర్ పెట్రోల్ ధర రూ.89.77లు ఉంటే, ఫిబ్రవరి 23వ తేదీ నాటికి లీటర్ పెట్రోల్ ధర రూ.94.54పైసలు పెరిగింది. మొత్తంగా 23 రోజుల్లోనే లీటర్ పెట్రోల్పై రూ.4.77పైసలు పెరిగింది.
ఒక్కో పంపులో ఒక్కో రేటు..
ఇంధన ధర పెరుగుదల పెనుభారంగా మారుతుంటే, నగరంలోని పెట్రోల్ పంపుల్లో ఒక్కో చోట ఒక్కో ధరలు ఉన్నాయి. హిందూస్తాన్, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం కంపెనీలతోపాటు ఇతర ప్రైవేటు కంపెనీలు ఇష్టం వచ్చిన రేట్లకు విక్రయిస్తున్నాయి. ఇదేమిటని ప్రశ్నిస్తే రవాణా చార్జీలు అంటూ లీటరుకు 20 పైసల నుంచి 50 పైసలు హెచ్చు తగ్గులు ఉంటోంది. పైసలే కదా అని వినియోగదారులు పెద్దగా పట్టించుకోవడం లేదు.
నగరంలోని సోమాజిగూడ రాజీవ్గాంధీ విగ్రహం దగ్గర నుంచి సికింద్రాబాద్ వెళ్లే మార్గంలో ప్యారడైజ్ వరకు మొత్తం ఇండియన్ ఆయిల్కు చెందిన పంపులే ఉన్నాయి. వీటిలో ధరలు మిగతా పంపుల కంటే 20 పైసలు ఎక్కువగా ఉంటోందని డీలర్లే పేర్కొంటున్నారు. ప్రాంతం, డిమాండ్, రవాణా చార్జీల మేరకు పెంచుకునే
అవకాశం ఉందని చెబుతున్నారు. ఇలా నగరంలో ఉన్న వందలాది పంపుల్లో పెట్రో ధరలు తేడా ఉన్నట్లు ‘నమస్తే తెలంగాణ’ బృందం పరిశీలనలో వెల్లడైంది. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు ప్రధాన రహదారిపై ఉన్న పెట్రోల్ పంపుల్లో ధరల తేడాలను గుర్తించారు.
ఇల్లు గడవటం కష్టమవుతుంది..
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. వచ్చే జీతంతో ఇల్లు గడవటమే కష్టమంటే.. పైగా పెట్రోల్ ధరల పెంపుతో మరింత ఇబ్బందిపడుతున్నాం. ప్రభుత్వం స్పందించి ధరలను తగ్గించాలి. పరోక్షంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపునకు మళ్లించేందుకు ఇలా చేస్తున్నారేమోనన్న అనుమానం కలుగుతున్నది. – భరత్, వినియోగదారుడు
ధరలు తగ్గించకుంటే సంక్షోభమే
ఇంధన ధరలు పెరగడానికి పలు రకాల కారణాలు ఉన్నాయి. మొదటిది పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలకు మూలాధారమైన క్రూడ్ ఆయిల్ను విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. 2020కి ముందు 70శాతం ఉండే దిగుమతి, ఆ తర్వాత 85 శాతానికి చేరుకున్నది. మన దగ్గర క్రూడ్ ఆయిల్ను మన అవసరాల మేరకు తవ్వి తీసే పరిస్థితి లేదు. తక్కువ ధరకు దొరికినప్పుడు కొనుగోలు చేసి నిల్వ చేసుకునే సామర్థ్యం మనకు లేదు. దీంతో పూర్తిగా దిగుమతుల మీదే ఆధారపడల్సి వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నా కొద్ది ఇక్కడ ధరలు పెంచుతున్నారు. రెండో కారణం.. మన దేశంలో వాహనాలకు సంబంధించి బీఎస్-4కు బదులు బీఎస్-6ను గతేడాది మార్చి నాటికి తప్పనిసరి చేశారు. అయితే బీఎస్-6 ప్రమాణాలతో కూడిన వాహనాలకు బీఎస్-6, 93 ఆక్టేన్ ప్రమాణాలకు అనుగుణంగా ఇంధనాన్ని తయారు చేయాల్సి ఉంటుంది. ఇంతకు ముందు బీఎస్-4, 93 ఆక్టేన్ ప్రమాణాల మేరకు తయారు చేసేవారు. దీంతో అదనంగా ఖర్చవుతోంది. ఇక కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్రం ప్రభుత్వం విధించే వ్యాట్లో 2020 ఏడాదిలో పోల్చితే, 2021లో తేడా ఉంది. లీటర్ పెట్రోల్ ధర ఇప్పుడు వందకు చేరువలో ఉంది. ఇలాగే పెంచుకుంటూ పోతే దేశంలో పెను సంక్షోభమే వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధన ధరలు తగ్గించేందుకు వెంటనే సమష్టిగా నిర్ణయం తీసుకోవాలి. – రాజీవ్ అమరం, జాయింట్ సెక్రటరీ, ఇండియన్ పెట్రోలియం డీలర్స్ సమాఖ్య
జీఎస్టీ పరిధిలోకి తేవాలి
పెట్రోల్, మద్యం ప్రజలకు రెండూ భారాలే. వైన్స్ల గురించి అందరూ మాట్లాడలేరు. పెట్రోలు అందరికీ అవసరమైంది. ప్రస్తుతం చాలా భారంగా మారింది. ఈ రెండింటినీ జీఎస్టీ పరిధిలోకి తేవాలి. కరోనా ఎఫెక్ట్ కేవలం కేంద్ర ప్రభుత్వం పైనే పడిందా? మాపై పడలేదా? ప్రభుత్వం అంటే ప్రజలే కదా. తిరిగి మాపైనే భారం వేయటం ఎంతవరకు సమంజసం. -ప్రసాద్
వెనుకబడిన దేశాల్లో తక్కువే…
ఇంతగా రేట్లు పెంచటం సరైంది కాదు. పెట్రోల్ భారాన్ని భరించలేకపోతున్నాం. నేను ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్న. నాకు వచ్చే జీతం రూ.12-13 వేలు. వీటిలో సగం పెట్రోల్కే పోతుంది. ఇంకా కుటుంబాన్ని ఎలా పోషించేది. ఎంతో వెనుకబడిన దేశాలైన బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంకలో పెట్రోల్ తక్కువ ధరకే దొరుకుతుంది. అభివృద్ధి చెందిన మనదేశంలో ఇంత రేటా ? ప్రభుత్వాలు ఆలోచించాలి. – వేణు
రాబోయే కాలర్ ట్యూన్ అంటూ వైరల్…
నమస్కారం… ధరలు పెరగడం ఇప్పుడు దేశమంతా మొదలై పోయింది. తినటం తగ్గించుకోండి. పాతబట్టలు ఉపయోగించండి. వీలైనంత వరకు నడవటం అలవాటు చేసుకోండి. ఇంధనంతో నడిచే వాహనాలు ఉపయోగించకండి. గుర్తుంచుకోండి, మీరు పోరాడాల్సింది ధరలతో… ప్రభుత్వంతో కాదు. – సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సందేశం
పప్పు, నూనెల ధరలూ పెరుగుతున్నయ్
బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి ట్రాలీ ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నా. డీజిల్ ధరలు పెరగడంతో వచ్చే కిరాయి కూడా మిగలడం లేదు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో పప్పు, నూనెల ధరలు కూడా పెరుగుతున్నాయి. పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ధరలు తగ్గించాలి.- మల్మాని రాజు, ఆటో ట్రాలీ డ్రైవర్, కేపీహెచ్బీ కాలనీ
బతుకు భారమవుతున్నది
పెట్రోల్ ధర పెరుతుండటంతో బతుకు భారమవుతున్నది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ధరతోపాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. రోజంతా కష్టపడితే వచ్చేది రూ.300 అయితే ఖర్చు 500 దాటుతుంది. ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరగడంతో నాలాంటి వాళ్లు బతకడం కష్టం. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని వేడుకుంటున్నా.- గందె వెంకటరమణ, ప్రైవేట్ ఉద్యోగి, బాలాజీనగర్, కూకట్పల్లి
ప్రభుత్వాలు ఆలోచించాలి..
నా బైక్లో గతంలో రోజుకు రూ.150 పెట్రోల్ పోయిస్తే రెండు లీటర్లు వచ్చేది.. రోజంతా సరిపోయేది. ఇప్పుడు రూ.200 పోయించాల్సిన వస్తున్నది. వచ్చే జీతం పెట్రోల్కే సరిపోతున్నది. చిన్నపాటి జీతంతో గడుపుతున్న మాపై పెట్రో భారం అధికమవుతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ధరలు తగ్గించాలి -దినేశ్ రెడ్డి, ప్రైవేటు ఉద్యోగి
మార్కెటింగ్ కష్టతరంగా మారింది
మార్కెటింగ్పై ఆధారపడిన వారికి పెరిగిన పెట్రో మంటలు చుక్కలు చూపిస్తున్నాయి. మొన్నటి రేటు నిన్న మారింది.. నిన్నటి రేటు నేటికి మారిపోయింది.. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ రేట్లు మధ్య తరగతి కుటుంబాలకు శాపంలా మారుతున్నాయి. సమయాభావంతో ప్రజా రవాణాను ఆశ్రయించలేం. ఇదే పరిస్థితి కొనసాగితే వాహనాలతో పని లేని ఉద్యోగాలు వెతుక్కోవాల్సిన స్థితి ఏర్పడుతుంది. -అశోక్, మార్కెటింగ్ సర్వీసెస్, సనత్నగర్
పెట్రోల్ అలవెన్సులు పెంచరు
మార్కెటింగ్ చేయిస్తున్న సంస్థలకు తెలుసు పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయని, అయినా వారు ఉద్యోగులకు ఇచ్చే అలవెన్సులు మాత్రం పెంచరు. ఉన్నదాంట్లో మేమే సర్దుకోవాల్సిన పరిస్థితి. పెరుగుతున్న పెట్రోల్ ధరలతో వాహనాలను పక్కన పడేయలేని పరిస్థితి. రేటు ఎంతైనా పెట్రోల్ పోసుకోక తప్పటం లేదు. పెరుగుతున్న రేట్లు తలచుకొని మనసులో కుమిలిపోవాల్సిన పరిస్థితి తప్ప.. చేయగలిగిందేమీ లేదు.- సత్యనారాయణ, ప్రైవేట్ ఉద్యోగి, మూసాపేట్
పరిస్థితులు చేయి దాటాయి
ఒకవైపు కొవిడ్ కారణంగా వ్యాపారాలు చతికిలబడ్డాయి. మరోవైపు పెరుగుతున్న పెట్రోల్ రేట్లు శాపంగా మారుతున్నాయి. ఫర్నిచర్ను కస్టమర్ ఇంటికి చేరవేసేందుకు ఆటోల చార్జీలు కూడా కొండెక్కాయి. దీంతో కస్టమర్లకు సర్దిచెప్పలేక, ఆటోల అద్దెలు తగ్గించమని కోరలేక సతమతమవుతున్నాం. ఇలా ఉంటే జీవితాలు నెట్టుకురావడం కష్టసాధ్యం.- షేక్ ఫజల్, ఫర్నిచర్ వ్యాపారి, ఎర్రగడ్డ
ఆగమాగం అయితం..
పెట్రోల్, డీజిల్ ధరలు గడియ, గడియకు మారుస్తుండ్రు. ఇట్లయితే ఎట్లా….? మేం నిత్తెం పాలు పోసేందుకు పోవాలే. పెట్రోల్ రేట్లు పెరగడంతో కష్టంగా ఉంది. సర్కార్లు రేట్లు తగ్గించాలె. లేకుంటే ఆగమాగం అయితం. – రాజు , పాల వ్యాపారి ( నాగోలు)
మధ్యతరగతి వారికి భారమే..
పెట్రోల్ , డీజిల్ ధరలు రోజురోజుకూ పెరగడం మధ్యతరగతి కుటుంబాలకు భారమే. నిత్యం సుమారు 100 కిలోమీటర్లు తిరుగుతాం. పెట్రోల్ ధర పెరగడంతో బండ్లు బయటికి తీయాలంటే భయమేస్తున్నది. ధరలు తగ్గిస్తేనే మంచిది. పెట్రోల్ పంపు వైపు చూడాలంటేనే జంకే పరిస్థితి వస్తున్నది. – కృష్ణ (రియల్ ఎస్టేట్), మన్సూరాబాద్, వీకర్ సెక్షన్ కాలనీ
సగం గ్యాస్కే పోతది..
రోజూ ఆటోనడిపితేనే పూట గడుస్తుంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావంతో గ్యాస్ ధరలు పెరిగాయి. రోజుకు రూ.1000 లాభం వస్తే అందులో సగానికి పైగా డబ్బులు ఆటో గ్యాస్కే పోతున్నది. నిన్నటి వరకు రూ.32 రూపాయలు ఉన్న ఆటో గ్యాస్ ధర డబుల్ అయ్యింది. సరైన గిరాకీ లేదు. – కె. భరత్, ఆటోడ్రైవర్
బడ్జెట్ పెరిగిపోతున్నది
నేను చందానగర్లో ఉంటాను. ప్రతి రోజు మేడ్చల్లో ఉండే కళాశాలకు బైక్పై వెళ్తుంటాను. పెరిగిన పెట్రోల్ ధరలతో నెలకు రూ. 2 వేలు వెచ్చించే పరిస్థితి నుంచి అదనంగా మరో రూ.1500 భారం పడుతున్నది. దీంతో ఇంటి బడ్జెట్లోనూ మార్పులు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పాకెట్ మనీ కూడా పెట్రోల్కే వినియోగిస్తున్నా. ధరల అదుపునకు చర్యలు తీసుకోవాలి. -ప్రణీత్, విద్యార్థి