‘హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ ఇంతటి భారీస్థాయి డాటా సెంటర్ను ఏర్పాటు చేస్తుండటం నాకు చాలా సంతోషంగా ఉన్నది. రూ.15,000 కోట్లకుపైగా పెట్టుబడులను ఇక్కడ పెట్టాలని సంస్థ నిర్ణయించింది. రాష్ర్టానికి వచ్చిన భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఇది కూడా ఒకటి కానున్నది’
– కే తారక రామారావు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
‘భారీ డాటా సెంటర్ రీజియన్ను ఏర్పాటు చేస్తున్నాం. భారత్లో సంస్థకిదే అతిపెద్దది అవుతుంది. హైదరాబాద్లో దీన్ని తీసుకొస్తున్నాం. దీని నిర్మాణానికి కనీసం రెండేైండ్లెనా పడుతుంది. 2025కల్లా దీని కార్యకలాపాలు మొదలు కావాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం’ – అనంత్ మహేశ్వరీ, మైక్రోసాఫ్ట్ ఇండియా అధ్యక్షుడు
హైదరాబాద్, మార్చి 7 : గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. దేశంలో తమ అతిపెద్ద డాటా సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నది. భారత్లో సంస్థకిది నాల్గో డాటా సెంటర్ అవగా, దీనిపై రూ.15,000 కోట్లకుపైగా పెట్టుబడులను పెట్టనున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో మైక్రోసాఫ్ట్ అవగాహన ఒప్పందం చేసుకున్నది. వచ్చే 15 ఏండ్లకుపైగా కాలంలో ఈ పెట్టుబడులు రానుండగా, 2025 నాటికి డాటా సెంటర్ కార్యకలాపాలు మొదలు కానున్నాయి. కాగా, చందన్వెల్లి, ఎల్లికట్ట, కొత్తూరు తదితర ప్రాంతాల్లో డాటా సెంటర్ విస్తరించి ఉంటుంది. సోమవారం హైదరాబాద్లో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరుల సమక్షంలో మైక్రోసాఫ్ట్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు జీన్-ఫిలిప్ కోర్టోయిస్, మైక్రోసాఫ్ట్ ఇండియా అధ్యక్షుడు అనంత్ మహేశ్వరి తదితరులు డాటా సెంటర్ రీజియన్ ఏర్పాటు వివరాలను ప్రకటించారు.
దేశంలో విస్తృతమైన డాటా సెంటర్ల నెట్వర్క్తోపాటు సుదూర డీఆర్ సదుపాయం కలిగివుండటం, భూకంప మండలాల పరిధికి దూరంగా ఉండటం, ఈ డాటా సెంటర్ రీజియన్ ప్రత్యేకత. మరోవైపు తమ పౌరసేవా సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడానికి, రాష్ట్ర ప్రభుత్వ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు తెలంగాణ, మైక్రోసాఫ్ట్లు అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య, లా ఎన్ఫోర్స్మెంట్, మొబిలిటీ తదితర కీలక రంగాల్లో సాంకేతికతను వృద్ధిచేసేందుకు దోహదపడనుంది. ఇదిలావుంటే దేశీయంగా ఇప్పటికే పుణె, ముంబై, చెన్నై నగరాల్లో మైక్రోసాఫ్ట్కు డాటా సెంటర్లున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీటిలోకెల్లా హైదరాబాద్దే అతిపెద్దది కావడం విశేషం. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ స్థానిక వ్యాపారాభివృద్ధికి ఈ డాటా సెంటర్ పరోక్షంగా ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఐటీ కార్యకలాపాలు, ఫెసిలిటీస్ మేనేజ్మెంట్, డాటా-నెట్వర్క్ సెక్యూరిటీ, నెట్వర్క్ ఇంజినీరింగ్ వంటి ఎన్నో విభాగాల్లో ఉద్యోగావకాశాలు వస్తాయని పేర్కొన్నారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ, క్లౌడ్ వినియోగంలో ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు మైక్రోసాఫ్ట్ ఆసక్తి కనబరుస్తున్నదన్న మంత్రి.. ప్రభుత్వ పాఠశాలలు ఇంగ్లీష్ మీడియంలోకి మారుతున్న వేళ డిజిటల్ ఎడ్యుకేషన్కు మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్ కలిసిరాగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అనంత్ మహేశ్వరీ మాట్లాడుతూ ఈ డాటా సెంటర్ మొదట్లో పెద్దది కాకపోయినా.. రాబోయే రోజుల్లో సంస్థకిదే ఇండియాలో పెద్దదవుతుందన్నారు. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ‘మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్ రీజియన్ డిజిటల్ ఎకానమీకి ఎంతగానో కలిసొస్తుంది. దీర్ఘకాల పెట్టుబడులకు డాటా సెంటర్లు లాభిస్తాయి’ అన్నారు.
ఐడీసీ వివరాల ప్రకారం
రిసెర్చ్ సంస్థ ఐడీసీ వివరాల ప్రకారం దేశంలో మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్లు 2016-2020 మధ్య భారత ఆర్థిక వ్యవస్థకు 9.5 బిలియన్ డాలర్ల రెవిన్యూను అందించాయి. అలాగే 15 లక్షల ఉద్యోగాలను ఇచ్చాయి. ఇందులో 1.69 లక్షల మంది ఫ్రెషర్స్ ఉన్నారు. కాగా, కంపెనీలు, స్టార్టప్లు, డెవలపర్లు, విద్య, ప్రభుత్వ సంస్థల కోసం క్లౌడ్, డాటా సొల్యూషన్స్, కృత్రిమ మేధస్సు, ప్రొడక్టివిటి టూల్స్, వంటి పూర్తిస్థాయి మైక్రోసాఫ్ట్ పోర్ట్ఫోలియో సేవలను ఈ డాటా సెంటర్ అందించనున్నది.
ఐటీ@తెలంగాణ
దేశంలో ఐటీ రంగం ప్రధానంగా విస్తరించిన నగరాల్లో హైదరాబాద్ ఒకటి. భారతీయ ఐటీ ఎగుమతుల్లో భాగ్యనగరానిది రెండో స్థానం. 2016 ఏప్రిల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఐసీటీ పాలసీని తీసుకొచ్చింది. గత ఆర్థిక సంవత్సరం హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎగుమతులు 7 శాతం వృద్ధి చెంది రూ.5 లక్షల కోట్లను తాకాయి. టీ-హబ్ ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా తెలంగాణ సర్కారు 2015 నుంచి ఇప్పటిదాకా 1,100లకుపైగా స్టార్టప్ల అభివృద్ధికి కృషి చేసింది. ఈ స్టార్టప్లు రూ.2,000 కోట్ల పెట్టుబడులను సమీకరించడం విశేషం. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ నేడు స్టార్టప్లకు అడ్డాగా మారిపోయింది.
276 కోట్లతో..
హైదరాబాద్లో పెట్టుబడులపై మొదట్నుంచీ అమితాసక్తిని ప్రదర్శిస్తున్న మైక్రోసాఫ్ట్.. రాష్ట్రంలో భారీగా భూములను కొనుగోలు చేస్తున్నది. రూ.276 కోట్లతో 115 ఎకరాలను సొంతం చేసుకోడం గమనార్హం. దాదాపు రూ.40 కోట్లతో మేకగూడలో 22 ఎకరాలను, రూ.164 కోట్లతో షాద్నగర్లో 41 ఎకరాలను, రూ.72 కోట్లతో చందన్వెల్లిలో 52 ఎకరాలను దక్కించుకున్నది. ఇప్పటికే హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలు సాగుతున్నాయి. ఇప్పుడు దేశంలోనే భారీ డాటా సెంటర్కూ భాగ్యనగరాన్నే సంస్థ ఎంచుకున్నది. దీంతో డాటా సెంటర్లకు హైదరాబాద్ అత్యంత అనువుగా మారిందని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ పరిణామం భవిష్యత్తులో మరిన్ని సంస్థలను హైదరాబాద్కు రప్పిస్తుందని, ముఖ్యంగా రియల్టీ, ఆఫీస్ స్పేస్కు డిమాండ్ పెరుగుతుందని చెప్తున్నారు.
సంస్థ: మైక్రోసాఫ్ట్
ఏర్పాటు: 4 ఏప్రిల్ 1975
వ్యవస్థాపకులు: బిల్ గేట్స్, పాల్ అలెన్
చైర్మన్, సీఈవో: సత్య నాదెళ్ల
ప్రధాన కేంద్రం: వాషింగ్టన్ (అమెరికా)
పరిశ్రమ: సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, కంప్యూటర్ హార్డ్వేర్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, సోషల్ నెట్వర్కింగ్ సర్వీస్, క్లౌడ్ కంప్యూటింగ్, వీడియో గేమ్స్, ఇంటర్నెట్, కార్పొరేట్ వెంచర్ క్యాపిటల్
బ్రాండ్లు: విండోస్, ఆఫీస్, సర్వర్లు, స్కైప్, విజువల్ స్టూడియో, డైనమిక్స్, ఎక్స్బాక్స్, సర్ఫేస్, మొబైల్
సేవలు: అజూర్, బింగ్, లింక్డిన్, యమ్మర్, ఎంఎస్డీఎన్, మైక్రోసాఫ్ట్ 365, వన్డ్రైవ్, ఔట్లుక్.కామ్, గిట్హబ్, టెక్నెట్, పే, మైక్రోసాఫ్ట్ స్టోర్, విండోస్ అప్డేట్, ఎక్స్బాక్స్ గేమ్ పాస్, ఎక్స్బాక్స్ నెట్వర్క్
విస్తరణ: ప్రపంచవ్యాప్తంగా
రెవిన్యూ: రూ.12.07 లక్షల కోట్లు (2021)
నిర్వహణ ఆదాయం: రూ.5.25 లక్షల కోట్లు (2021)
నికర ఆదాయం: రూ.4.55 లక్షల కోట్లు (2021)
మొత్తం ఆస్తులు: రూ.22.60 లక్షల కోట్లు (2020)
మొత్తం ఈక్విటీ: రూ.8.88 లక్షల కోట్లు (2020)
ఉద్యోగులు: 1,82,268 (2021 జూన్ ఆఖరు నాటికి)
స్టాక్ మార్కెట్ల్ల లిస్టింగ్: నాస్డాక్ 100 కంపోనెంట్, డీజేఐఏ కంపోనెంట్, ఎస్అండ్పీ 100 కంపోనెంట్, ఎస్అండ్పీ 500 కంపోనెంట్