న్యూఢిల్లీ : టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరో 200 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. కంపెనీలో వేరే పొజిషన్ను చూసుకోవాలని లేదా పరిహార ప్యాకేజ్ అందుకోవాలని మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులకు తేల్చిచెప్పినట్టు తెలిసింది. మైక్రోసాఫ్ట్ ఇటీవల పునర్వ్యవస్ధీకరణ పేరుతో 1800 మంది ఉద్యోగులను తొలగించగా తాజా లేఆఫ్స్ టెకీల్లో గుబులు రేపుతోంది. కంపెనీకి చెందిన ఓ సీనియర్ డిజైనర్ లింక్డిన్ పోస్ట్లో తాజా లేఆఫ్స్పై బాంబు పేల్చాడు.
మోడ్రన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ టీం సభ్యులు ఈ వారంలో కఠినమైన వార్త వింటారని ఆయన రాసుకొచ్చారు. అయితే తాజా తొలగింపులపై కంపెనీ ఇంతవరకూ అధికారికంగా ఎలాంటి వివరాలూ వెల్లడించలేదు. మైక్రోసాఫ్ట్ ఇటీవల 1800 మంది ఉద్యోగులపై వేటు వేసిన సంగతి తెలిసిందే. వ్యవస్దాగత సర్ధుబాట్ల పేరుతో పలు విభాగాలకు చెందిన ఉద్యోగులను సాగనంపింది.
కంపెనీకి చెందిన 1.8 లక్షల మంది ఉద్యోగుల్లో కేవలం 1 శాతం లోపు ఉద్యోగులనే తొలగించామని ఇది సాధారణంగా అన్ని కంపెనీలు చేసే పనేనని అప్పట్లో మైక్రోసాఫ్ట్ చెప్పుకొచ్చింది. ఇక టిక్టాక్, ట్విట్టర్, నెట్ఫ్లిక్స్ సహా పలు కంపెనీలు ఆర్ధిక మందగమన భయాలతో ఉద్యోగులను విధుల నుంచి తొలగించాయి. ఇదే కారణంతో గూగుల్, ఫేస్బుక్ వంటి పలు టెక్ కంపెనీలు కూడా నియామకాల ప్రక్రియను నిలిపివేశాయి.