న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఐటీచట్టం సెక్షన్ 66ఏ కింద నమోదైన కేసులను ఎత్తివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు చట్టంలోని సెక్షన్ 66ఏ కింద నమోదైన కేసులను వెనక్కు తీసుకోవాలని రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులను కేంద్ర హోంశాఖ ఆదేశించింది. అలాగే సెక్షన్ కింద కొత్త కేసులను సైతం నమోదు చేయొద్దని సూచించింది. 2015లోనే రద్దయిన ఈ సెక్షన్ కింద ఇప్పటికీ వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవడంపై సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో రెండు వారాల్లోగా స్పందించాలంటూ కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఈ నెల 5న ఆదేశించింది.
ఈ నేపథ్యంలో ‘సెక్షన్ 66ఏ’ కేసులను తక్షణం వెనక్కు తీసుకోవాలంటూ కేంద్రం రాష్ట్రాలను కోరింది. సెక్షన్ 66ఏ ప్రకారం.. అవమానకర లేదా వివాదాస్పద సందేశాలను టెక్స్ట్, ఆడియో, వీడియో, చిత్రాల రూపంలో పంపిస్తే మూడేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే.. 66ఏలోని పదజాలం అస్పష్టంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉందంటూ సుప్రీం కోర్టు ఈ సెక్షన్ను 2015లో కొట్టేసింది. దీన్ని పూర్తిస్థాయిలో రద్దు చేయడం మినహా మరోమార్గం లేదని న్యాయస్థానం అప్పట్లో వ్యాఖ్యానించింది. ఇటీవల పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (పీయూసీఎల్) దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఈ క్రమంలో కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.