ఢిల్లీ ,జూన్ 19:భారత్, భూటాన్ దేశాలు పర్యావరణ రంగంలో రెండు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనికి సంబంధించిన పత్రాలపై సంతకాలు చేశాయి. భారతదేశం తరఫున కేంద్ర అటవీశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్, భూటాన్ తరఫున విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి , జాతీయ పర్యావరణ కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ తాండి డోర్జీ, ఈ అవగాహన ఒప్పందంపై దృశ్య మాధ్యమం ద్వారా సంతకాలు చేశారు. వాతావరణ మార్పు, వ్యర్థ పదార్థాల నిర్వహణ వంటి అంశాలకు సంబంధించి, ద్వైపాక్షిక సహకారంలో కొత్త మార్గాలకు, ఈ అవగాహన ఒప్పందం అవకాశం కల్పించనుందని జవదేకర్ పేర్కొన్నారు.
ఇరు దేశాల మధ్య సంబంధాన్ని మంరింతగా కొనసాగించడానికి ఒక ప్రతీకగా అభివర్ణిస్తూ, వాతావరణ మార్పులతో సహా పర్యావరణ సంబంధిత సమస్యలపై భూటాన్తో చర్చలు జరపాలని భారత్ కోరుకుంటుందని ఆయన తెలిపారు. భారత్, భూటాన్ దేశాల మధ్య భాగస్వామ్య మద్దతును మరింత పెంచడానికి, వాయు కాలుష్యం నివారణ, వ్యర్థ పదార్థాల నిర్వహణ, రసాయన నిర్వహణ, వాతావరణ మార్పు మొదలైన రంగాలలో ఉత్తమ పద్ధతులను ఇచ్చి పుచ్చుకోడానికీ ఈ అవగాహన ఒప్పందం ఒక వేదికగా నిలవనున్నది.