న్యూఢిల్లీ : పీఎన్బీ కుంభకోణం కేసులో దేశం విడిచిపారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి డొమినికా కోర్టు సోమవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఈ మేరకు పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఆంటిగ్వా, బార్బుడా వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఆంటిగ్వాలో వైద్య చికిత్సల కోసం మాత్రమే బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. తర్వాత డొమినికాకు తిరిగి రావాలని చెప్పింది. మెహుల్ చోక్సీ న్యూరోలాజికల్ సమస్యలతో బాధపడుతున్నారని, దానికి చికిత్స డొమినికాలో అందుబాటులో లేదని చోక్సీ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో రూ.13,500 కోట్ల రుణం ఎగవేత కేసులో నిందితుడిగా ఉన్న మెహుల్ చోక్సీ 2018లో భారత్ విడిచి ఆంటిగ్వా బార్బుడాకు పారిపోయిన విషయం తెలిసిందే. మే 23న విందు కోసం వెళ్లిన చోక్సీ ఆ తర్వాత డొమినికాలో కనిపించాడు. డొమినికాలోకి చోక్సీ అక్రమంగా ప్రవేశించినట్లు పోలీసులు అభియోగాలు మోపారు. ఆంటిగ్వా నుంచి భారత్కు రప్పించేందుకు సీబీఐ, ఈడీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో క్యూబా పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే డొమినికాలో పట్టుబడినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఆంటిగ్వా బీచ్ నుంచి కిడ్నాప్ చేసి డొమినికాకు తీసుకువచ్చారని చోక్సీ ఆరోపించారు.