షిల్లాంగ్: మేఘాలయ సీఎం కాన్రాడ్ కె సంగ్మా నేతృత్వంలోని మేఘాలయ డెమోక్రటిక్ అలయన్స్ (ఎండీఏ) ప్రభుత్వంలో భాగమైన నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), బీజేపీ మధ్య విభేదాలు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి ఎన్పీపీ కౌంటర్ ఇచ్చింది. ముందు సీబీఐని రప్పించిన తర్వాత ప్రభుత్వం నుంచి తప్పుకోవాలంటూ కౌంటర్ ఇచ్చింది. మేఘాలయా బీజేపీ ఇన్చార్జ్ చుబా అవో, శనివారం మీడియాతో మాట్లాడారు. ఎండీఏ ప్రభుత్వం నుంచి వైదొలగడంపై నెలలోపు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సంగ్మా ప్రభుత్వంపై వచ్చిన పలు అవినీతి ఆరోపణలపై తమ పార్టీ అధ్యయనం చేస్తున్నదని, అన్ని పత్రాలు అందిన తర్వాత సీబీఐ దర్యాప్తు కోరుతామని అన్నారు.
కాగా, మేఘాలయా సంకీర్ణ ప్రభుత్వంలో కీలకమైన ఎన్పీపీ ఘాటుగా బదులిచ్చింది. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, డిప్యూటీ సీఎం ప్రిస్టోన్ టిన్సాంగ్ దీనిపై మంగళవారం స్పందించారు. కూటమి ప్రభుత్వం నుంచి బీజేపీ తప్పుకోవడాన్ని తాము స్వాగతిస్తామని అన్నారు. ఇప్పటికే ఆలస్యమైందంటూ ఎద్దేవా చేశారు.
మరోవైపు బీజేపీ రాజకీయాలు చేస్తున్నదని ప్రిస్టోన్ విమర్శించారు. తొలుత కూటమి నుంచి తప్పుకుని ఆ తర్వాత సీబీఐ, ఈడీని ఉసిగొల్పేందుకు ప్రయత్నిస్తున్నది ఆరోపించారు. ‘ముందుగా సీబీఐని, ఈడీని పిలిపించండి, ఆ తర్వాత కూటమి నుంచి తప్పుకోండి’ అని సూచించారు. ‘ఆరోపణల నుంచి సాధువులా క్లీన్గా బయటపడాలనుకుంటే ప్రభుత్వం నుంచి అనవసరంగా ఎందుకు తప్పుకోవడం?’ అని చురకంటించారు.