యువ హీరో శర్వానంద్, గ్లామర్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ ప్రధాన పాత్రలలో కిషోర్ తెరకెక్కించిన చిత్రం శ్రీకారం. మార్చి 11న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను సోమవారం ఖమ్మంలో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట, రైటర్ సాయి మాధవ్ బుర్రా, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
చిరంజీవి మాట్లాడుతూ.. ఖమ్మం ప్రజానీకం తనపై చూపిస్తున్న ప్రేమకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా ఖమ్మం ప్రజలను మళ్ళీ కలుసుకోవడం సంతోషంగా ఉంది. . ఈ ఈవెంట్కు రావడానికి నిర్మాతలు ముఖ్య కారణం అయితే.. శర్వానంద్ కూడా ఓ కారణం అని అన్నారు చిరంజీవి. రామ్ చరణ్.. నాకు కాల్ చేసి శ్రీకారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు గెస్ట్గా వెళతారా అంటే నేను ఖమ్మంలో ఉన్నాను కదా, అని అన్నాను. దానికి వాడు అందరు అక్కడికి వస్తారు అని అనడంతో చాలా సంతోషంగా అనిపించింది.
శర్వానంద్ చిన్నప్పటి నుంచీ మా ఇంట్లోనే రామ్ చరణ్తో కలిసి పెరిగాడు. నాకు శర్వానంద్ బిడ్డలాంటివాడు.. మరో రామ్ చరణ్. శర్వానంద్ నేను కలిసి థమ్సప్ యాడ్లో చేశాం. అలానే శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో గెస్ట్ రోల్ పోషించి అలరించాడు. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో శర్వానంద్ చేసిన ఆ సీన్ అతని నటనకు ఓ మచ్చుతునక అని చెప్పవచ్చని చిరంజీవి అన్నారు. ఆనాడే శర్వా నటనకు శ్రీకారం పడిందని.. నటనకు తిలకం దిద్దింది కూడా తానేనని చిరంజీవి గర్వంగా చెప్పారు. శ్రీకారం లాంటి మంచి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న శర్వాను అందరు ఆశీర్వదించండి అని చిరంజీవి కోరారు .