Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవికి రాజ్యసభ సీటు ఖాయమైందని వస్తున్న వార్తలపై జర్నలిస్టులు గన్నవరం ఎయిర్పోర్టులో ఆయనను ప్రశ్నించారు. దీనిపై చిరంజీవి స్పందిస్తూ తనకు రాజ్యసభ సీటు ఇస్తారన్న వార్తలు ఊహాజనితమే అని స్పష్టం చేశారు. రాజ్యసభ సీటు ఇస్తారన్న వార్తలను పూర్తిగా ఖండిస్తున్నాను. అలాంటి ఆఫర్లు తన వద్దకు రావు అని తేల్చిచెప్పారు.
రాజకీయాలకు తాను పూర్తిగా దూరంగా ఉన్నానని పేర్కొన్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు ఆఫర్లు ఎవరూ ఇవ్వరు అని చిరంజీవి స్పష్టం చేశారు. అలాంటి ఆఫర్లకు తాను అతీతం అని, ఆఫర్లకు లోబడే వ్యక్తిని కాదు అని తెలిపారు. పదవులను కోరుకోవడం తన అభిమతం కాదు అని చిరంజీవి తేల్చిచెప్పారు.
సినీ ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలపై ఏపీ సీఎం జగన్తో చర్చించేందుకు చిరంజీవి నిన్న తాడేపల్లికి వచ్చిన విషయం విదితమే. జగన్తో సుమారు గంటన్నర పాటు చిరంజీవి చర్చలు జరిపారు. త్వరలోనే సినీ ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిరంజీవి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.