సంగారెడ్డి, జూన్ 28 : ఈ ఏడాది వర్షాలు కొంత ఆలస్యంగా కురువడంతో అన్నదాతలు పంటలు వేసేందుకు ఆకాశం వైపు చూపులు మొదలు పెట్టారు. జూన్ రెండో వారంలో చెదురుమొదురు వానలు పడడంతో రైతులు దుక్కులు సిద్ధం చేసి విత్తనాలు వేసేందుకు సన్నద్ధ్దమయ్యారు. మంగళవారం ఒక్కతాటిగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురువడంతో అన్నదాతల కండ్లల్లో సంతోషం తాండవించింది. తొలకరి చినుకులకు విత్తనాలు వేయడంతో ఎండలకు ఎండిపోయి రైతన్నకు నష్టం కలిగిస్తున్నదని దిగులు పడ్డారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ వర్షం జనాలను అతలకుతలం చేసింది. ఎడతెరిపి లేకుండా రెండు గంటలు దంచికొట్టడంతో ప్రజల్లో సంతోషం వెల్లివిరిసింది. వర్షానికి ప్రధాన రహదారులన్నీ వరద నీటితో జలమయమై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మెదక్ జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే.