సిద్దిపేట, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టడాన్ని రైతులు తమ సంపూర్ణ్ణ మద్దతును తెలియజేస్తున్నారు. రైతు ఉద్యమంలో అసువులు బాసిన రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచి ఆర్థిక సాయాన్ని అందించడంపై యావత్తు దేశ రైతాంగం దృష్టి సీఎం కేసీఆర్పై పడింది. ఇలాంటి నేత దేశానికి కావాలంటూ అనేక రాష్ర్టాల రైతులు కోరుకుంటున్నారు.
దేశంలోని వివిధ రాష్ర్టాల్లో సీఎం కేసీఆర్ పర్యటించినప్పుడు అనూహ్యస్పందన వచ్చింది. అక్కడి రైతులు దేశం కోసం ముందుకు రావాలని ఆకాంక్షించారు. వివిధ రాష్ర్టాలకు చెందిన రైతు సంఘాల నాయకులు వచ్చి ఇక్కడి నిర్మించిన ప్రాజెక్టులు అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్వయంగా మా రాష్ర్టాల్లో ఇలాంటి పథకాలు, అభివృద్ధి ఉంటే ఎంత బాగుండు, ఇలాంటి నేత మాకు ముఖ్యమంత్రిగా ఉంటే మా రాష్ట్రం కూడా ఇలా అభివృద్ధిలో అగ్రగామిగా ఉండేదని రైతు సంఘాల నాయకులు వ్యాఖ్యానించారు.
దేశ రాజకీయాల్లోకి రావాలని స్వయంగా సీఎం కేసీఆర్ను రైతు సంఘాల నేతలు ఆహ్వానించిన విషయం తొలిసిందే. ఒకప్పుడు ‘పల్లె పల్లెనా పల్లెర్లు మొలిచే నాతెలంగాణ లోనా ’ అంటూ కన్నీళ్ల కరువు పాటలు పాడుకున్నాం.. సాగునీరు లేక బీడు బారిన భూముల గురించి విషాద గీతాలు విన్నాం. ఇదంతా ఎనిమిదేండ్ల కిందటి పరిస్థితులు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ ముం దు చూపుతో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి.
కరువు భూముల్లో సిరుల పంటలు పండుతున్నాయి. వ్యవసాయం అంటే దండుగ కాదు.. పండుగ అనే విధంగా రూపురేఖలు మారాయి. సముద్ర మట్టానికి 600 మీటర్ల ఎత్తుకు కాళేశ్వరం నీళ్లు తీసుకువచ్చి రైతుల కన్నీళ్లు తుడిచారు. అన్నపూర్ణ, రంగనాయక, మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లలో గోదావరి జలాలు నింపడం వల్ల మండు టెండల్లో చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి.
సమైక్య రాష్ట్రంలో అప్పటి పాలకులు వ్యవసాయాన్ని చిన్నచూపు చూశారు. నాటి పాలకుల నిర్లక్ష్యంతో విత్తనాలు ఎరువుల కోసం రైతులు దుకాణాల ముందు క్యూలైన్లు కట్టాల్సిన పరిస్థితి ఉండేది. తీరా పంట చేతికొచ్చాక పెట్టిన పెట్టుబడి కూడా రాక వందలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడేవారు. నాటి విపత్కర పరిస్థితుల నుంచి నేడు జిల్లా కల్పతరువుగా మారింది. వ్యవసాయం అంటే దండుగ కాదు.. పండుగ అనే విధంగా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారు.
రాష్ర్టానికే పరిమితం కావొద్దు..
రైతు కుటుంబంలో పుట్టిన కేసీఆర్కు రైతుల కష్టాలు మొత్తం తెలుసు. గత ఏడాది యాసంగిలో పండించిన వరి ధాన్యం కొనమని మోదీ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడితే సీఎం కేసీఆర్ మాత్రం చివరి గింజ వరకూ కొనుగోలు చేసి రైతులను అక్కున చేర్చుకుండు. రైతు బీమా, రైతు బంధు పథకాలతో నేడు తెలంగాణ రైతులంతా ఆనందంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. రాష్ర్టానికే మాత్రమే పరిమితం కాకుండా దేశ రైతాంగానికి కూడాసీఎం కేసీఆర్ నాయకత్వం వహించాలి.
– చౌదరిపల్లి తిర్మలయ్య, రైతు,నిజాంపేట
దేశ రైతులు సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నారు..
దేశ రైతుల చూపు సీఎం కేసీఆర్ వైపు ఉంది. తెలంగాణలో అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు చేయాలని ఎదురు చూస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎదుర్కోగలిగే శక్తి సీఎం కేసీఆర్కే ఉంది. దేశాభివృద్ధి కోసం విజన్తో పనిచేసే నాయకుడు, దేశ రైతులపై సంపూర్ణ అవగాహన కలిగిన ఆయనకే
మా మద్దతు ఉంటుంది.
-శ్రీనివాస్ నాయక్, రైతు, చిన్నహైదరాబాద్, జహీరాబాద్
దేశరాజకీయాల్లోకి రావాలి
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి పోతేనే దేశంలో ఉన్న రైతుల బతుకులు మారుతాయి. రాష్ట్రంలో కేసీఆర్ రైతాంగానికి ఎంతో చేస్తుండు. రైతుబంధు, రైతుబీమా పథకాలు ఇన్నేండ్ల కాలంలో ఎవరూ తేలేదు. రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి కావడంతోనే రైతులకు ఎన్నో ప్రయోజనాలు చేస్తుండు. అయనలాంటి ముఖ్యమంత్రి తమకు కూడా కావాలని వేరే రాష్ట్రపోళ్లు కోరుకుంటుండ్రు. జాతీయ పార్టీ పెట్టి దేశానికి కేసీఆర్ ప్రధాని అయితే బాగుంటుంది. అన్ని వర్గాలు అభివృద్ధి, సంక్షేమంతో సంతోషంగా ఉంటాయి.
-కమ్మెట పోచిరెడ్డి, తెల్లాపూర్ రైతు, ఆర్సీపురం
రైతు పక్షపాతి ..
రైతు పక్షపాతి సీఎం కేసీఆర్. రైతు బంధు, రైతు బీమా లాంటి ఎన్నో అద్భుత పథకాలకు రూపకల్పన చేసిన నాయకుడు. రైతు కష్టాలను తెలుసుకుని, ఈ పథకాలు అత్యవసరమని దేశంలో ఎక్కడాలేని విధంగా అమలు పరిచిన గొప్ప నాయకుడు. దేశం మొత్తం వీటిని ప్రవేశపెట్టాలంటే సీఎం కేసీఆర్కు మాత్రమే సాధ్యమవుతుంది. ఆయనవెంటనే దేశ రాజకీయాల్లోకి రావాలని వారు ఎదురుచూస్తున్నారు. ఇంతటి అత్యుత్తమ పథకాలను అందించిన నాయకుడికి ధన్యవాదాలు.
– రైతు సిహెచ్ రమేశ్, రైతు, రేగోడ్
దేశ ప్రజలంతా ఎదురుచూస్తున్నరు
కేంద్రంలో బీజేపీ పాలనపట్ల దేశంలో రైతన్నలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సామాన్య ప్రజల జీవితాలు దుర్భరంగా మారాయి. మన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ అమలుచేస్తున్న పథకాలు దేశమంతా ప్రవేశపెడితే ఆయనకు ఎదురుండదు. సీఎం సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. దేశ ప్రజలంతా ఆయనకు స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్నరు.
– యాదయ్య, రైతు, బుసారెడ్డిపల్లి, మునిపల్లి మండలం