హత్నూర, సెప్టెంబర్ 27: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తరువాత తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తున్నదని మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. హత్నూరలో మూడు రోజులుగా కొనసాగిన జోనల్ స్థాయి క్రీడాపోటీల ముగింపు కార్యక్రమానికి హాజరై విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ ప్రభుత్వం పేద విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనడం వల్ల దేహదారుఢ్యం పెంపొందుతుందన్నారు.
అనంతరం గురుకులాల జాయింట్ సెక్రటరీ శారద మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో చదువుతున్న ఎంతోమంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తూ ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. గురుకులాల్లో విద్యా బోధన చేస్తున్న అధ్యాపకులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తు వారిని తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఆర్సీవో బీమయ్య, ఏఆర్సీవో సురేందర్రెడ్డి, సర్పంచ్ వీరస్వామిగౌడ్, ప్రిన్సిపాల్ వెంకట వివేకానంద, సుధాకర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ ఆనంద్కుమార్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, నాయకులు, ప్రిన్సిపాళ్లు, పిడిలు, పీఈటీలు పాల్గొన్నారు.
కొనసాగిన క్రీడలు
మూడు రోజులుగా నిర్వహించిన 8వ జోనల్ స్థాయి క్రీడా పోటీల్లో సంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల కు చెందిన 935మంది క్రీడా కారులు అండర్-14,17, 19విభాగాల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, చెస్, క్యారంబోర్డు, బాల్బ్యాడ్మింటన్తో పాటు అథ్లెటిక్ క్రీడాపోటీలు కొనసాగాయి.