పటాన్చెరు, సెప్టెంబర్ 26: చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ అన్నారు. సోమవారం పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామం లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, సర్పంచ్ నీలం మధుముదిరాజ్ సాకారంతో, రజక సంఘం నేతల ఆధ్వర్యం లో చాకలి ఐలమ్మ కుటుంబ సభ్యులు వీరవనిత కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ముత్తంగి రింగ్ రోడ్డు జంక్షన్ నుంచి చిట్కుల్ వరకు భారీ బైక్ ర్యాలీతో చాకలి ఐలమ్మ కుటుంబ సభ్యులకు స్వాగతం పలికారు. సాంస్కృతిక కళా బృందాల నృత్యాలతో చిట్కుల్ హోరెత్తింది.
ఐలమ్మ విగ్రహావిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్సీ మాట్లాడారు. తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమానికి ప్రేరణగా ఆమె పోరాటం నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఐలమ్మను గౌరవించి, ఆమె జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న పార్టీ టీఆర్ఎస్సేనన్నారు. తెలంగాణ సాధించేందుకు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నామన్నారు. కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం బంగారు తెలంగాణ వైపు పయనిస్తున్నదన్నారు. రజకులు, ముదిరాజ్లు చదువుకు ప్రాధాన్య త ఇవ్వాలని సూచించారు. నీలం మధు ముదిరాజ్ చేస్తున్న సమాజ సేవను ఆయన కొనియాడారు.
సీఎం కేసీఆర్ స్ఫూర్తితోనే తెలంగాణ పోరాటంలో పాల్గొన్నానని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు. సీఎం అంటేనే తనకు ఇష్టమైన నాయకుడన్నారు. ఐలమ్మ విగ్రహావిష్కరణ విజయవంతం చేయాలని మంత్రి కేటీఆర్ మెసేజ్ చేసి శుభాకాంక్షలు తెలిపారన్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్రా వు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆశీస్సులతోనే తాను సేవా కార్యక్రమాలు చేస్తున్నానన్నారు. ఐలమ్మ కుటుంబ సభ్యులకు సత్కరించడం తనకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు. తనను ఆశీర్వదిస్తున్న ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, సీనియర్ జర్నలిస్టు పాశంయాదగిరి, తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి మఠం బిక్షపతి, యాదగిరి, ఢిల్లీ వసంత్, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాచర్ల ఉప్పలయ్య, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు నల్లతీగల రాజు, రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వర్సపల్లి నర్సింహులు, మహిళా అధ్యక్షురాలు లావణ్య, ప్రధాన కార్యదర్శి సుధామణి, శరిష, చాకలి వెంకటేశ్, జంపన్న, శనిగరపు రాజు, మడివాల చంద్రశేఖర్, జిలా రజక సంఘం అధ్యక్షుడు జీతయ్య, పోచయ్య, సీహెచ్ సంజీవ, సత్తయ్య, ఈర్ల రాజు, ఆంజనేయులు, నర్సింహులు, దేవేందర్, నాయకులు పాల్గొన్నారు.