ఈ నెల 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని మెదక్ కలెక్టర్ హరీశ్ అధికారులను ఆదేశించారు. సోమవారం వేడుకల ఏర్పాట్లపై ఎస్పీ రోహిణిప్రియదర్శిని, అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్తో కలిసి కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటి రోజు మెదక్, నర్సాపూర్ నియోజకర్గకేంద్రాల్లో 15వేల మందితో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెండో రోజు కలెక్టరేట్లో జాతీయ పతాకావిష్కరణ, మూడో రోజు కవి సమ్మేళనం, సాంస్కృతిక, సన్మాన కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మెదక్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని మెదక్ కలెక్టర్ హరీశ్ కోరారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వజ్రోత్సవ ఏర్పాట్లపై ఎస్పీ రోహిణిప్రియదర్శిని, అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల16న మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో 15వేల మందితో ర్యాలీలు నిర్వహించేందుకు ఆర్డీవోలను నోడల్ అధికారులుగా నియమించామన్నారు. ఎమ్మెల్యేల సూచనల మేరకు రూట్ మ్యాప్ రూపొందించుకోవాలని సూచించారు. మెదక్లో మున్సిపల్ కార్యాలయం నుంచి జూనియర్ కళాశాల వరకు, నర్సాపూర్లో అల్లూరి సీతారామరాజు గురుకుల పాఠశాల వరకు ర్యాలీ నిర్వహించాలన్నారు.
ట్రాఫిక్కు అంతరాయం కలుగకుండా ర్యాలీ సాగేలా చూడాలన్నారు. ర్యాలీ, సభలకు అంబులెన్స్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని డీఎంహెచ్వోకు సూచించారు. 17న కలెక్టరేట్లో జాతీయ పతాకావిష్కరణ ఉంటుందని, అనంతరం హైదరాబాద్లో ఆతిథివాసి భవన్, బంజారా భవన్ ప్రారంభోత్సవంలో జిల్లా నుంచి షెడ్యూల్డ్ తెగల వారు పాల్గొనేందుకు జాబితా సిద్ధం చేయాలన్నారు. 18న కలెక్టరేట్లోని ఆడిటోరియంలో కవి సమ్మేళనం, సాంస్కృతిక కార్యక్రమాలు, సన్మానాలు నిర్వహిస్తామన్నారు. ఆ కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిందిగా జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డికి సూచించారు. సమావేశంలో ఆర్డీవోలు సాయిరాం, వెంకట ఉపేందర్రెడ్డి, డీటీవో శ్రీనివాస్గౌడ్, డీఎస్పీ సైదులు, యాదవరెడ్డి, జడ్పీ సీఈవో శైలేశ్, డీఎంహెచ్వో వెంకటేశ్వర్రావు, డీఈవో రమేశ్కుమార్, జిల్లా యువజన సంక్షేమాధికారి నాగరాజు, జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి సత్యనారాయణ, బీసీ అభివృద్ధి అధికారి కేశూరాం, జిల్లా గిరిజన సంక్షేమాధికారి జెమ్లానాయక్, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ ఇందిర, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంఈవోలు పాల్గొన్నారు.