మెదక్, అక్టోబర్ 26 : ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు అందించే రుణాలను సద్వినియోగం చేసుకొని ప్రజలు ఆర్థ్ధికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ హరీశ్ అన్నారు. మంగళవారం మెదక్ పట్టణంలోని మాయ గార్డెన్స్లో జిల్లా లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులతో ఏర్పాటు చేసిన రుణ వితరణ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవితంలో పైకి రావడానికి పలు మార్గాలుంటాయని, కొందరు ఉద్యోగ మార్గాలు ఎంచుకోగా, మరికొందరు వ్యాపారం వైపు దృష్టి సారిస్తారని, అట్టి వారు బ్యాంకులు అందించే రుణాలు అందిపుచ్చుకొని తమ వ్యాపారాలను విజయవంతంగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో గానీ, జిల్లాలో స్వయం సహాయక బృందాలు రుణాలు పొందడంలో ముందుండటంతో పాటు వాటిని సక్రమంగా సద్వినియోగం చేసుకొని తిరిగి చెల్లిస్తూ, ఆదర్శంగా నిలిచాయన్నారు. ఈ సందర్భంగా వివిధ బ్యాంకుల ద్వారా రూ.270 కోట్ల 55 లక్షల రుణాలను లబ్ధిదారులకు అందజేశారు. ఇందులో స్వయం సహాయక సంఘాలకు రూ.108 కోట్ల 71 లక్షలు, మెప్మా పరిధిలోని సంఘాలకు రూ.3 కోట్ల 66 లక్షలు కాగా, ఇతర విద్యా, గృహ, వాహన, పీఎంఏవై తదితర రంగాలకు రూ.130 కోట్ల 54 లక్షల రుణాలను అందజేశారు. అనంతరం వివిధ బ్యాంకులు ఏర్పాటు చేసిన స్టాల్స్ను కలెక్టర్ తిలకించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ జోగేష్చంద్ర సాహూ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, సిబీఐ రీజనల్ మేనేజర్ పంకజ్ కుమార్, గ్రామీణ బ్యాంకు ఏజీఎం బాలాజీరావు, నాబార్డు ఏజీఎం సెసిల్ తిమోతీ, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ వేణుగోపాల్రావు, డీఆర్డీవో శ్రీనివాస్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జగదీశ్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, లబ్ధిదారులు, స్వయం సహాయక బృందాల సభ్యులు పాల్గొన్నారు.