ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్), అక్టోబర్ 22 : ప్రఖ్యాత విశ్వవిద్యాలయం ఉస్మానియా వర్సిటీ 81వ స్నాతకోత్సవానికి సిద్ధమైంది. ప్రతిష్టాత్మకమైన ఈ వేడుక ఈనెల 27న ఠాగూర్ ఆడిటోరియంలో ఉదయం 9.30న ప్రారంభం కానున్నది. ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ చాన్స్లర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్య అతిథిగా డీఆర్డీవో చైర్మన్, కేంద్ర రక్షణ పరిశోధన, అభివృద్ధి శాఖ కార్యదర్శి డాక్టర్ జి.సతీశ్రెడ్డి హాజరుకానున్నారు. ఈ వేడుకల్లో 2018-2019, 2019-2020 విద్యా సంవత్సరాలకు సంబంధించిన స్వర్ణ పతకాలు, ఎంఫిల్, పీహెచ్డీ పట్టాలు సాధించిన వారికి వాటిని ప్రదానం చేస్తామని ఓయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ తెలిపారు. ఈ వేడుకల్లో వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ వర్సిటీ నివేదికను సమర్పిస్తారు. అనంతరం గవర్నర్, ముఖ్య అతిథులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. వివరాలకు ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్ www.osmania.ac.in లో చూడవచ్చని అధికారులు తెలిపారు.
గుర్తింపు కార్డులు తప్పనిసరి..
స్వర్ణ పతకాలు, ఎంఫిల్, పీహెచ్డీ పట్టాలు సాధించిన అభ్యర్థులకు ఈనెల 23, 24 తేదీల్లో ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచ్ కార్యాలయంలో సంప్రదించి గుర్తింపుకార్డులు, ఆహ్వాన పత్రాలు పొందాలని అధికారులు సూచించారు. పట్టాలు పొందే ప్రతి ఒక్కరూ విధిగా తెలుపు దుస్తులు ధరించాలని చెప్పారు. స్నాతకోత్సవ సంప్రదాయం ప్రకా రం అలా వచ్చిన వారిని మాత్రమే అనుమతిస్తామని, గుర్తింపు కార్డులు వెంట కచ్చితంగా తెచ్చుకోవాలని తెలిపారు.
350 పీహెచ్డీ పట్టాల ప్రదానం..
అతిథుల చేతుల మీదుగా పీజీ, పీహెచ్డీల్లో స్వర్ణ పతకాలు సాధించిన 82మందికి వాటిని ప్రదానం చేయనున్నారు. వీరితో పాటు 350 పీహెచ్డీ పట్టాలు అందించనున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో స్వర్ణ పతకాలు సాధించిన 22 మందికి వారి వారి కళాశాలలకు పతకాలను పంపిస్తారు.
ఓయూ స్నాతకోత్సవం ఎంతో ప్రతిష్టాత్మకం…
ఎంతో ప్రతిష్టాత్మకంగా స్థాపించిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రస్తుతం 81వ స్నాతకోత్సవాన్ని జరుపుకుంటోంది. స్నాతకోత్సవంలో పతకాలు, పట్టాలు పొందడాన్ని విద్యార్థులు ఎంతో గొప్పగా భావిస్తారు. ఈ స్నాతకోత్సవాన్ని ఏటా నిర్వహించడం లేదు. చివరిసారిగా 80వ స్నాతకోత్సవాన్ని 2019 జూన్ 17న నిర్వహించారు. గత స్నాతకోత్సవంలో ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, గువ్వల బాలరాజు తదితరులు పట్టాలు పొందారు. ప్రస్తుతం జరుగనున్న వేడుకల్లో రాష్ట్ర సమాచార కమిషనర్ శంకర్నాయక్ పట్టా అందుకోనున్నారు.