ఈసారి మూడు రెట్లు అధికంగా వచ్చే అవకాశం
జిల్లాలో 147 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
ఈ నెల 7వ తేదీ నుంచి కొనుగోళ్లు షురూ
రైతులు వారికిచ్చిన టోకెన్ల ప్రకారం రావాలి
సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు
అధికారులు, రైస్ మిల్లర్లతో సమీక్ష
సంగారెడ్డి కలెకరేట్, ఏప్రిల్ 3: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేలా అసవరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో యాసంగి పంట ధాన్యం కొనుగోళ్లపై డిప్యూటీ తహసీల్దార్లు, వ్యవసాయశాఖ అధికారులు, ఐకేపీ, ప్యాక్స్ సెంటర్ల ఇన్చార్జీలు, రైస్ మిల్లర్లతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత యాసంగి కంటే ఈ సారి మూడు రెట్ల ధాన్యం అధికంగా వస్తుందన్నారు. జిల్లాలో 147 ధాన్యం కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ఐకేపీ ద్వారా 80, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 64, మార్కెటింగ్ శాఖ ద్వారా 3 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. టోకెన్ సిస్టం ద్వారా నియంత్రిత పద్ధతిలో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జాలీలు, తేమ యంత్రాలు ఏవైనా మరమ్మతులు ఉంటే వెంటనే చేయించుకోవాలన్నారు.
నిబంధనలు పాటించాల్సిందే
రైస్ మిల్లర్లు కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలు పాటించాలని కలెక్టర్ స్పషం చేశారు. అధికారులు పారదర్శకంగా పని చేయాలని ఆదేశించారు. నిర్ణీత తేమ మేరకు ధాన్యం తీసుకురావాలని, ఆ దిశగా అవగాహన కల్పించాలని సూచించారు. ఏ రోజు కొనుగోళ్లు ఆ రోజు ట్యాబ్లో నమోదు చేయాలన్నారు. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ సూచించారు. అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున అవసరమై టార్ఫాలిన్లు కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉండాలన్నారు. రైతుల ముసుగులో వచ్చే వ్యాపారులను గుర్తించాలని, అలాంటి వారిపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
7 నుంచి ధాన్యం కొనుగోళ్లు
జిల్లాలో ఈ నెల 7 నుంచి 10వ తేదీలోగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు. మిల్లర్లు వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే దించుకోవాలాని సూచించారు. ధాన్యం అమ్మిన 24 గంటలలోగా డబ్బులు రైతులకు అందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం మిల్లర్లకు చేరడానికి అవసరమైన లారీలను ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. వేసవి కాలం దృష్ట్యా అన్ని కొనుగోలు కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అనంతరం వరి పంటకు సంబంధించిన పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. సదస్సులో జెడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాసరావు, సివిల్ సప్లయిస్ డీఏం సుగుణాబాయి, ఆర్డీవోలు, డిప్యూటీ తహసీల్దార్లు, వ్యవసాయశాఖ అధికారులు. ఐకేపీ, ప్యాక్స్ సెంటర్ల ఇంచార్జీలు, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.