బాన్సువాడ, జూన్ 18: ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి రైతులకు అందిస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని చింతల్ నాగరాం శివారులో రూ.15 కోట్లతో చేపట్టిన చెక్డ్యామ్ పనులను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్పీకర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో తాగు, సాగునీటికి ఏకైక సౌకర్యం గోదావరి, కృష్ణా నదులు మాత్రమేనని, ఇవే ఉత్తర, దక్షిణ తెలంగాణ సస్యశ్యామలం కావడానికి దోహదపడుతున్నాయని తెలిపారు. జలవనరుల సంస్థ నివేదిక ఆధారంగా 45 ఏండ్లుగా గోదావరి నది నీరు ధవళేశ్వరం ద్వారా ఏడాదికి 1,600 టీఎంసీలు వృథాగా సముద్రంలోకి పోతున్నాయన్నారు.
ఆ నీరు వృథాగా పోకుండా బీడు భూములకు అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు చేపట్టారని వివరించారు. ఉత్తర తెలంగాణలో పాత ఆయకట్టు కింద ఉన్న 20 లక్షల నుంచి 25 లక్షలు స్థిరీకరణ జరగడమే కాకుండా, మరోకొత్త ఆయకట్టు 30 లక్షల ఎకరాలకు వివిధ పద్ధతుల ద్వారా నీరు అందించబోతున్నామని తెలిపారు. ఉత్తర తెలంగాణలోని పాత నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో కొంతభాగం దశల వారీగా నీటిని అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.